Raj Thackeray ను కలిసిన Fadnavis.. సరికొత్త ఊహాగానాలు
ABN, First Publish Date - 2022-07-15T20:34:06+05:30
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలోని ఆయన..
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackera)ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ముంబైలోని ఆయన నివాసం 'శివతీర్ధ'లో శుక్రవారం కలుసుకున్నారు. ఇటీవల ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కూల్చివేయడం, బీజేపీ మద్దతుతో అధికారం చేపట్టడం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో రాజ్ థాకరే, ఫడ్నవిస్ కలుసుకోవడం పలు ఊహాగానాలకు తెరతీసింది.
రాజ్ థాకరే గత నెలలో లీలావతి ఆసుపత్రిలో హిప్ రీప్లేస్మెంట్ (Hip replacement) సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ అనంతరం ఆయనను ఫడ్నవిస్ కలవడం ఇదే మొదటిసారి. ఇటీవల ఫడ్నవిస్ను ప్రశంసిస్తూ రాజ్ థాకరే ఒక బహిరంగ లేఖ రాయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి పదవి ఫడ్నవిస్కే దక్కే వీలున్నప్పటికీ పార్టీ విధేయతకు ఆయన ఉదాహరణగా నిలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని ఆ లేఖలో రాజ్థాకరే ప్రశంసించారు. త్వరలో బ్రిహాన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరుగనుండటం, షిండే క్యాబినెట్ విస్తరణ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాజ్, ఫడ్నవిస్ కలుసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. కేవలం ఒకే ఎమ్మెల్యే ఉన్న ఎంఎన్ఎస్ గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది.
Updated Date - 2022-07-15T20:34:06+05:30 IST