Lalu prasad: విదేశాల్లో వైద్య చికిత్సకు ఢిల్లీ కోర్టు అనుమతి
ABN, First Publish Date - 2022-09-28T20:27:30+05:30
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వైద్య చికిత్స కోసం విదేశాలకు..
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad yadav) వైద్య చికిత్స కోసం (Medical treatment) విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse avenue court) బుధవారంనాడు అనుమతి (permission) ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి 25వ తేదీ వరకూ వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు కోర్టు అనుమతిని లాలూ కోరారు. ఐఆర్సీటీసీ (IRCTC) కుంభకోణంలో లాలూ ప్రసాద్పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం లాలూ బెయిలుపై ఉన్నారు. కాగా, ఆయన బెయిలు రద్దు చేయలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తిపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సమాధానం ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టుకు మరికొంత గడువు ఇచ్చింది. అక్టోబర్ 18వ తేదీన విచారణ ఉన్నందున యాదవ్ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో అవినీతికి పాల్పనట్టు సీబీఐ ఆరోపిస్తోంది. రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను 2006లో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డారని రబ్రీ దేవీ, లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్పై సీబీఐ అభియోగాలు మోపింది. ఐఆర్సీటీసీ హోటల్ కాంట్రాక్ట్ తమకు వచ్చేలా చేసినందుకు సుజాత హోటల్స్ యజమానులు విజయ్, వినయ్ కొచ్చార్లు పాట్నా జిల్లాలో మూడు ఎకరాల కమర్షియల్ ప్లాట్ను లాలూ కుటుంబానికి ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 2019 జనవరిలో లాలూకు బెయిల్ మంజూరైంది. తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని కోర్టు షరతులు విధించింది.
Updated Date - 2022-09-28T20:27:30+05:30 IST