Cyclone: ముంచుకొస్తున్నమరో తుపాను!
ABN, First Publish Date - 2022-12-12T07:34:26+05:30
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13న ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాతి క్రమంగా బలపడి
16న వాయుగుండం..వాతావరణ శాఖ వెల్లడి
చెన్నై/అడయార్: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఈ నెల 13న ఏర్పడే ఉపరితల ఆవర్తన ద్రోణి ఆ తర్వాతి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని వాతావారణ శాఖ వెల్లడించింది. ఇది మరింతగా బలపడి ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా శ్రీలంకను ఆనుకుని వున్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం లో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని డెల్టా జిల్లాల్లో ఈ నెల 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇటీవల మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. ఈ నెల 12, 13 తేదీల్లో లక్షదీవులు, కేరళ, కర్ణాటక కోస్తాతీర ప్రాంతాలతో పాటు దానిని ఆనుకునివున్న ప్రాంతాల్లో దక్షిణతూర్పు (ఆగ్నేయం), మధ్యపశ్చిమ ప్రాంతమైన అరేబియా సముద్రంలో గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల ఈ ప్రాంతాలకు చెందిన జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొదని సూచించింది. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి చెన్నై, తాంబరం, గూడువాంజేరి, ఆవడి, తిరుముల్లైవాయల్, మరైమలర్ నగర్ తదితరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Updated Date - 2022-12-12T07:34:29+05:30 IST