మరిన్ని Covid కేసులు పెరిగే అవకాశం: మంత్రి
ABN, First Publish Date - 2022-01-18T16:36:21+05:30
పండుగ సెలవులు ముగించుకొని తిరిగి వస్తున్న వారితో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సోమవారం మంత్రి
పెరంబూర్(చెన్నై): పండుగ సెలవులు ముగించుకొని తిరిగి వస్తున్న వారితో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వుల మేరకు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్, మందులు తదితరాలు సిద్ధం చేశామన్నారు. స్థానిక స్టాన్లీ ఆస్పత్రిలో 2,700, రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2,050, కీల్పాక్ ప్రభుత్వాస్పత్రిలో 1,600 పడకలతో ప్రత్యేక వార్డులు, నందనం ట్రేడ్ సెంటర్లో 950 పడకలు, ఇంజంబాక్కం,మంజంబాక్కం, కేళంబాక్కం, తాంబరం సిద్ధ వైద్యకళాశాలలో తలా 100 పడకలతో క్వారం టైన్ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.91 లక్షల పడకలు సిద్ధం చేయగా, ప్రస్తుతం 8 వేల పడకలు మాత్రమే నిండాయన్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా మరణాలు తక్కువగా నమోదవుతుండడం కాస్త సంతోషకరమని. 15 నుంచి 18 ఏళ్లలోపున్న విద్యార్థులకు టీకా వేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. 60 ఏళ్లకు పైబడిన 90 లక్షల మంది ఇంకా రెండో డోస్ వేసుకోలేదని, అలాంటి వారిళ్లకే వెళ్లి వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలని, బయటకు వచ్చే సమయంలో మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-01-18T16:36:21+05:30 IST