ప్రార్థనా స్థలాల చట్టంపై రాజ్యాంగ ధర్మాసనం!
ABN, First Publish Date - 2022-09-10T08:28:36+05:30
ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం-1991ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి..
ఐదుగురు సభ్యుల బెంచ్కు అప్పగించవచ్చన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం-1991ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యాలను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ పి.ఎ్స.నరసింహల ధర్మాసనం పరిశీలించింది. వీటిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి రెండు వారాల గడువు ఇచ్చింది. కొన్ని ప్రార్థనా స్థలాల స్వరూపాన్ని 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న విధంగానే కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయకూడదని, దీనిపై కోర్టులను ఆశ్రయించే అవకాశం లేదని పేర్కొంటూ ఆ చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. వీటిని సవాలు చేస్తూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ దావా వేశారు.
వారణాసి, మథుర మసీదులపై హిందువులు హక్కులు కోరడానికి వీలుగా ఈ నిబంధనలు కొట్టివేయాలని మరో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కోరారు. ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసిన జమాయిత్ ఉలామా ఐ హింద్ తరఫున న్యాయవాది ఎజాజ్ మక్బూల్ వాదనలు వినిపిస్తూ రామజన్మభూమి కేసు విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ చట్టాన్ని పరిశీలించిందని తెలిపారు. అందువల్ల ఇప్పుడు దాన్ని కొట్టివేయాల్సిన పనిలేదని చెప్పారు.
Updated Date - 2022-09-10T08:28:36+05:30 IST