కాంగ్రెస్ చీఫ్ ఖర్గే?
ABN, First Publish Date - 2022-10-01T07:14:50+05:30
రాజ్యసభలో కాంగ్రెస్ నేత, సోనియా కుటుంబ విధేయుడు మల్లికార్జున ఖర్గే (80) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలను దాఖలుచేశారు.
విధేయతకు పట్టం.. పెద్దాయనకు పగ్గాలు
అధ్యక్ష పదవికి ఎన్నికలు ఇక లాంఛనమే
జీ-23 నేతల మద్దతూ 80 ఏళ్ల వృద్ధ నేతకే
నామినేషన్లు వేసిన శశిథరూర్, ఖర్గే, త్రిపాఠీ
ప్రధాన పోటీలోని ఇద్దరూ దక్షిణాది నేతలే
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో కాంగ్రెస్ నేత, సోనియా కుటుంబ విధేయుడు మల్లికార్జున ఖర్గే (80) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలను దాఖలుచేశారు. అనూహ్యంగా ఖర్గే పోటీకి దిగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బరి నుంచి వైదొలిగారు. మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థించారు. ఆయన నామినేషన్ పత్రాలపై దిగ్విజయ్ సింగ్ తోపాటు మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హూడా, పృథ్వీరాజ్ చౌహాన్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, అధికార ప్రతినిఽధి అభిషేక్ మనూ సింఘ్వీ, మాజీ కేంద్రమంత్రి అజయ్ మాకెన్ వంటి హేమాహేమీలు సంతకాలు చేశారు. తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశి థరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠీ కూడా తమ నామినేషన్లు సమర్పించారు. ఖర్గేతో పాటు అధిష్ఠానం ఎవరికీ మద్దతునీయడం లేదని రిటర్నింగ్ అధికారి మఽధుసూధన్ మిస్త్రీ ప్రకటించినప్పటికీ శుక్రవారం దృశ్యం అందుకు భిన్నంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఖర్గేకు మద్దతు నీయడంతో ఆయనకు పరోక్షంగా అధిష్ఠానం మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది. జార్ఖండ్ నేత త్రిపాఠీ నామమాత్రంగానే పోటీలో దిగారని, అసలు పోటీ ఇద్దరు దక్షిణాది నేతలు ఖర్గే, శశిథరూర్ల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన ఖర్గే తమకు పూర్తి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో గాంధీల కుటుంబం ఆయనను రంగంలోకి దించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాజస్థాన్లో అశోక్ గహ్లోత్ వర్గం తిరుగుబాటు చేయడం, ముకుల్ వాస్నిక్ జీ-23 నేతల్లో భాగంగా సోనియాకు అసమ్మతి లేఖ రాయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఖర్గే వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్....సోనియాగాంధీని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పోటీలో దిగాల్సిందిగా అర్ధరాత్రి ఖర్గేకు వేణుగోపాల్ చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ కోరిక ప్రకారం ఖర్గే ఒకే వ్యక్తి- ఒక పదవి సూత్రం ప్రకారం రాజ్యసభలో పార్టీ నాయకత్వాన్ని వదులుకుంటారని, ఆయన స్థానంలో దిగ్విజయ్ సింగ్కు కానీ చిదంబరంకు కానీ అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు తెలిపాయి. కాగా గత 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
గెలిస్తే నాలుగో దళిత నేత
కాంగ్రెస్ పార్టీలోని దళిత నేత ముకుల్ వాస్నిక్తో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయించాలని అధిష్ఠానం ఆలోచించింది. చివరి నిమిషంలో మనసు మార్చుకుని మరో దళిత నేత ఖర్గేకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. సౌమ్యుడు, అందరితో సత్సంబంధాలు నెలకొల్పుకునే ఖర్గే ... గాంధీ కుటుంబానికి విధేయుడు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు 1999, 2004, 2013 లలో మూడు సార్లు ప్రయత్నించినా, సఫలం కాలేకపోయారు. రాజకీయ కారణాల వల్ల ఎస్ఎం కృష్ణ, ధర మ్సింగ్, సిద్దరామయ్యలకు అప్పట్లో ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. కర్ణాటకలోని గుల్బర్గాలోని వార్ వట్టిలో ఒక పేద దళిత కుటుంబంలో ఖర్గే జన్మించారు. బీఏ డి గ్రీ తర్వాత లా చేశారు. కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు, 1969లో విద్యార్థి దశలో కాంగ్రెస్ లో చేరారు. గుల్బర్గా సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటినుంచీ అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 1972 నుంచి తొమ్మిదిసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. దేవరాజ్ అర్స్ మంత్రివర్గంలో ఆయన తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. అనంతరం గుండూరావు, వీరప్ప మొయిలీ, బంగారప్ప తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అసెంబ్లీలో పార్టీ నేతగా వ్యవహరించారు. 2009లో లోక్సభ సభ్యుడుగా పార్లమెంట్లో అడుగు పెట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కార్మిక, రైల్వే మంత్రిగా ఉన్నారు. 2014లో కూడా ఆయన తిరిగి గుల్బార్గా నుంచి రెండోసారి లోక్ సభకు ఎన్నికై లోక్సభలో పార్టీ కి నాయకుడుగా వ్యవహరించారు. తన రాజకీయ జీవిత కాలంలో 2019లో తొలిసారి పరాజయం పొందారు. అయినా, అధిష్ఠానం రాజ్యసభకు పంపి పార్టీ నాయకుడుగా ఎంపికచేసింది. హిందీ, ఇంగ్లిషులలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఖర్గే...అజాత శత్రువుగా పేరు పొందారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశం కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇది. కర్ణాటకలో తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకునే ఆలోచనలో భాగంగా కూడా ఖర్గేను రంగంలోకి దించినట్టు భావిస్తున్నారు.
దక్షిణాదికి మళ్లీ చాన్స్..
పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య. కె.కామరాజ్, నిజలింగప్ప, పీవీ నరసింహారావు దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఖర్గే ఎంపికైతే ఈ బాధ్యతలు చేపట్టిన ఏడవ దక్షిణాది కాంగ్రెస్ నేతగా గుర్తింపుపొందుతారు. సంజీవయ్య, జగ్జీవన్రామ్ దళితులనుంచి కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. ఈ వరుసలో ఖర్గే నాలుగో నేత అవుతారు. అయితే ఖర్గే తనను తాను దళితుడుగా ఏనాడూ చెప్పుకోలేదు. ‘‘నన్ను దళితుడు అనకండి...కాంగ్రెస్ నాయకుడుగానే చూడండి’’ అని ఆయన పలుసార్లు చెప్పారు. బౌద్ధమతాన్ని అనుసరించే ఖర్గే వివాదాల జోలికిపోని సాత్వికుడుగా పేరుపొందారు.
శశిథరూర్ ‘మ్యాప్’లో కాలేశారు
జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ లేకుండా భారత్
మ్యాప్తో మేనిఫెస్టో
ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రోజే కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వివాదంలో చిక్కుకున్నారు. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు లేకుండా భారత్ మ్యాప్తో మేనిఫెస్టో విడుదల చేయడం వివాదాస్పదమైంది. నెటిజెన్లు, ముఖ్యంగా బీజేపీ మద్దతుదారులు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న శశిథరూర్ కరెక్ట్ వర్షెన్ను మేనిఫెస్టోలో పొందుపరిచారు. జరిగిన తప్పిదానికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఇలాంటి పొరపాటు చేయరని వివరణ ఇచ్చారు. కాగా గతంలోనూ శశిథరూర్ ఇలాంటి తప్పే చేశారు. 2019లో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనలు తెలిపినపుడు ఆయన ట్విటర్లో షేర్ చేసిన ప్రచార పత్రంలో పొరపాటు చోటు చేసుకుంది. అప్పట్లో దీనిపై బీజేపీ ఐటీ సెల్, ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో ఆయన ఆ ట్వీట్ను తొలగించారు.
Updated Date - 2022-10-01T07:14:50+05:30 IST