మళ్లీ నీటిలోనే చెన్నై
ABN, First Publish Date - 2022-01-01T16:45:22+05:30
ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం కురిసిన కుండపోత వర్షాలకు నగరం సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ వరద పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. శుక్రవారం
- నగరాన్ని వీడని వరుణుడు
చెన్నై: ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం కురిసిన కుండపోత వర్షాలకు నగరం సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ వరద పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. శుక్రవారం ఉదయం నుంచి నగరంలో ఆకాశం మేఘావృతమైంది. డిసెంబరులో రుతుపవన ప్రభావిత వర్షాలు సాధారణ స్థితికంటే 74 శాతం అధికంగా కురిసినట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. గురువారం నాలుగు జిల్లా ల్లోనూ అత్యధిక ప్రాంతాల్లో 24 శాతం వర్షపాతం నమోదైంది. మార్గశిరం లో ఇంత భారీగా వర్షం కురవటం అరుదైన విషయమని తెలిపారు. నగరంలో శుక్రవారం ఉదయం వర్షం కాస్త తెరపి ఇచ్చినా సుమారు వంద ప్రాంతాల్లో ఇంకా వరద నీరు కొనసాగుతూనే వుంది. కార్పొరేషన్ అధి కారులు రహదారులు, పల్లపు ప్రాంతాల్లోని వర్షపునీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. టి.నగర్ తిరుమలైపిళ్లై రోడ్డు, హబీబుల్లా రోడ్డు, ఆర్కాట్ రోడ్డు, పేపర్మిల్స్ రోడ్డు, రాజమన్నార్ రోడ్డు, కళాక్షేత్ర మెయిన్ రోడ్డు, ఎల్బీ రోడ్డు, ఈస్ట్కో్స్టరోడ్డు, వెస్ట్మాంబళం, అశోక్నగర్, రంగరాజ పురం, వడపళని, కోడంబాక్కం, మధురవాయల్ తదితర ప్రాంతాల్లో రహదారులపై వర్షపునీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రికల్లా వాననీటి తొలగింపు పనులన్నీ పూర్తవుతాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ వర్షానికి చెంబరంబాక్కం, పుళల్ జలాశయాల్లో నీటిమట్టం కూడా పెరగటంతో అదనపు జలాలను విడుదల చేశారు.
Updated Date - 2022-01-01T16:45:22+05:30 IST