GCC: నగరంలో మాస్కు ధారణ తప్పనిసరి
ABN, First Publish Date - 2022-09-17T16:30:33+05:30
రోజురోజుకు జ్వరాలు ప్రబలుతుండడం, కరోనా అంతరించిపోకపోవడం తదితరాల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని చెన్నై కార్పొరేషన్ సత్వర
- జీసీసీ
చెన్నై, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు జ్వరాలు ప్రబలుతుండడం, కరోనా అంతరించిపోకపోవడం తదితరాల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని చెన్నై కార్పొరేషన్ సత్వర చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధారణ చేపట్టాలని ఆదేశించింది. నగరంలో వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్(Corona virus) వ్యాప్తి గురువారం కాస్త పెరిగింది. దీనికితోడు త్వరలో పండుగల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో నగరంలో వాణిజ్య ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశాలున్నందున తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రకటించింది. నగరంలోని షాపింగ్ మాల్స్, సినిమాథియేటర్లు, నగల దుకాణాలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో నగరవాసులు విధిగా మాస్కు ధరించి భౌతిక దూరాన్ని కూడా పాటించాలని కార్పొరేషన్(Corporation) అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ కూడా వేసుకోవాలని, రెండు విడతల టీకా వేసుకున్నవారు కూడా బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించడం వల్ల కరోనా బారినపడకుండా ఉండటమే కాకుండా ‘ఫ్లూ’ జ్వరాలను కూడా నిరోధించవచ్చనే విషయాన్ని నగరవాసులు గుర్తుంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
Updated Date - 2022-09-17T16:30:33+05:30 IST