టచ్ చేసి చూడండి !
ABN, First Publish Date - 2022-06-09T13:21:06+05:30
మదురై ఆధీనం వ్యవహారాల్లో దేవాదాయశాఖ జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
- మదురై ఆధీనం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు
- ప్రభుత్వానికి అన్నామలై సవాల్
చెన్నై, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మదురై ఆధీనం వ్యవహారాల్లో దేవాదాయశాఖ జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు. తిరుచ్చిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ... చిదంబరం ఆలయంలో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేవాదాయశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఆ శాఖ మంత్రి శేఖర్బాబు మదురై ఆధీనం సహా సాధువులను హెచ్చరించేలా వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. అన్నింటా నెంబర్ ఒన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న డీఎంకే ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, డీఎంకే మంత్రులు, నేతలు హిందీ చదివితే పానీపురి అమ్ముకోవలసి వస్తుందని చెప్పడం సరి కాదన్నారు. నూతన విద్యావిధానంలో నిర్బంధ హిందీకి తావులేదని ప్రధాని మోదీ సుస్పష్టమైన ప్రకటన చేసినా డీఎంకే ప్రభుత్వం ఆ నూతన విద్యావిధానంలోని అంశాలను కాపీగొట్టి రాష్ట్రానికి ప్రత్యేక విద్యా విధానం రూపొందించనుండటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో 62.3 లక్షలమంది అసంఘటిత కార్మికులకు రూ.2లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించారని వివరించారు. మంత్రి శేఖర్బాబు పళని ఆలయానికి సంబంధించి ఐదెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారని, వాస్తవానికి ఆ స్థలాన్ని పదేళ్లుగా డీఎంకే నేతలే ఆక్రమించుకున్నారని చెప్పారు. మెకెదాటు ఆనకట్టకు వ్యతిరేకంగా కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులంతా ఆందోళనలు జరుపుతుంటే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలంతా మహాబలిపురం రిసార్ట్లో తలదాచుకున్నారని ఎద్దేవా చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అన్నామలై జోస్యం చెప్పారు.
Updated Date - 2022-06-09T13:21:06+05:30 IST