Cattle Theft: బంగ్లా యువకుడిని కొట్టి చంపిన స్థానికులు
ABN, First Publish Date - 2022-08-25T00:40:59+05:30
పశువుల దొంగతనానికి వచ్చిన ఓ బంగ్లాదేశ్ యువకుడిని పశ్చిమబెంగాల్లోని..
జల్పాయ్గురి: పశువుల దొంగతనానికి (cattle theft) వచ్చిన ఓ బంగ్లాదేశ్ యువకుడిని (Bangladesh man) పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గిరి జిల్లా సరిహద్దు గ్రామంలో స్థానికులు కొట్టిచంపారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదడంతో ఆ వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, బంగ్లాదేశ్కు చెందిన ఒక ముఠా మంగళవారం రాత్రి ఇండియాలో చొరబడి కుకుర్జాన్ ప్రాంతం బరువా పరాలోని ఓ ఇంట్లోని పశువులను దొంగిలించింది. వాటిని తోలుకుని బంగ్లాదేశ్లోకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అప్రమత్తమై వారిని ఛేజ్ చేశారు. ముఠాలోని సభ్యులంతా ఏదోవిధంగా సరిహద్దు దాటగా, ఒకడు మాత్రం మిగిలిపోయాడు. అతను సమీపంలోని టీ తోటలోకి పారిపోయాడు. దీంతో స్థానికులు రాత్రంతా అక్కడే కాపుకాసి ఉదయమే అతన్ని పట్టుకుని కొట్టిచంపారు. మృతుని నార్త్ బంగ్లాదేశ్లోని పంచగఢ్ జిల్లాకు చెందిన మహమ్మద్ సలీమ్గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
కాగా, పశువులను ఎత్తుకుపోయే ముఠా తన ఇంటిపై దాడి చేసినట్టు న్రిపెన్ రాయ్ అనే వ్యక్తి తెలిపాడు. ముఠాను తాము ఛేజ్ చేసినప్పుడు, గోవులను వదలేసి వారు పరారయ్యారని, అందరూ బంగ్లాదేశ్ ప్రాంతంలోకి వెళ్లిపోగా, ఒకరు మాత్రం మిగిలిపోయాడని చెప్పాడు. దాడిలో అతను చనిపోయాడని, గతంలో కూడా తమ గ్రామంలోని గోవులను ఈ ముఠా దొంగిలించేదని తెలిపాడు.
Updated Date - 2022-08-25T00:40:59+05:30 IST