రూ.401 కోట్ల ఆస్తులు సీజ్
ABN, First Publish Date - 2022-08-12T09:13:20+05:30
మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి రూ.401 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు.
రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల వజ్రాలు, ముత్యాలు
మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఐటీ సోదాలు.. నోట్ల కట్టలు లెక్కించడానికే 13 గంటలు
న్యూఢిల్లీ, జల్నా, ఆగస్టు 11: మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి రూ.401 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. లెక్కల్లో చూపని మరో రూ.150 కోట్ల ఆదాయాన్ని కూడా గుర్తించారు. ఉక్కు, వస్త్ర, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కొన్ని పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సమాచారం అందడంతో మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు అనేక చోట్ల సోదాలు నిర్వహించి రూ.390 కోట్ల బినామీ లేదా లెక్కల్లో చూపని ఆస్తులను సీజ్ చేశారు. ఇందులో రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన వజ్రలు, ముత్యాలు ఉన్నాయి. పట్టుబడిన నగదు కట్టలు లెక్కించడానికే ఐటీ సిబ్బందికి 13 గంటలు పట్టింది. 260 మంది ఐదు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించారు.
లెక్కల్లో చూపని రూ.150 కోట్ల ఆదాయం..
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన రత్నాలు, బంగారు ఆభరణాలు, ఆస్పత్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే ఓ సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి లెక్కల్లో చూపని రూ.150 కోట్లకుపైగా ఆదాయాన్ని గుర్తించినట్టు సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) గురువారం తెలిపింది. ఈనెల 3 నుంచి జైపూర్, కోటా జిల్లాల్లో సుమారు 40 చోట్ల ఈ సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. లెక్కల్లో చూపని రూ.11 కోట్ల ఆస్తులను ఇప్పటి వరకు సీజ్ చేసినట్టు పేర్కొంది. లెక్కల్లో చూపని ఆదాయంతో అప్పులు ఇవ్వడం, భూముల కొనుగోలు, లగ్జరీ హోటల్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపింది. ఈ అప్పులపై వచ్చే వడ్డీని కూడా లెక్కల్లో చూపలేదని పేర్కొంది
Updated Date - 2022-08-12T09:13:20+05:30 IST