44వేల ఇళ్లు రద్దు
ABN, First Publish Date - 2022-03-01T08:22:57+05:30
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) కింద రాష్ట్రానికి గతంలో
- ఏపీ అభ్యర్థనకు కేంద్రం ఆమోదం
- లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని ఆక్షేపణ
- జేఎన్ఎన్యూఆర్ఎం నిధులు
- 52కోట్లు వెనక్కివ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ) కింద రాష్ట్రానికి గతంలో మంజూరు చేసిన 44వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తం 44,075ఇళ్లు రద్దు చేయాలని ఏపీ ప్రభు త్వం చేసిన ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని కేంద్ర మంజూరీలు, పర్యవేక్షణ కమిటీ(సీఎ్సఎంసీ) ఆమోదించింది. భూ వివాదాలు, కోర్టు కేసులు, లబ్ధిదారుల శాశ్వత వలసలు, ఇళ్లు నిర్మించుకోడానికి అనాసక్తి వంటి కారణాలతో ఇళ్లను వెనక్కి ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల్లో పేర్కొంది.
2015-16 నుంచి 2020-21 మఽధ్యకాలంలో రాష్ట్రానికి మంజూరు చేసిన 44,075 ఇళ్లను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించింది. ఏపీ ప్రతిపాదనలను ఆమోదించిన సీఎ్సఎంసీ... ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు రూపొందించే సమయంలో లబ్ధిదారుల ఎంపికను జాగ్రత్తగా చేపట్టాలని సూచించింది. కాగా, ఏపీలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని కమిటీ ఆక్షేపించింది. సకాలంలో, వేగవంతంగా నిర్మాణాల పూర్తికి రోడ్మ్యాప్ రూపొందించాలని సూచించింది. 80వేల ఇళ్ల నిర్మాణ స్థలాలను మార్చాలని చేసిన ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖ పరిశీలించిందని, రాష్ట్రప్రభుత్వం నుంచి స్పష్టత కోరిందని తెలిపింది. పెద్దసంఖ్యలో ఇళ్లకు స్థల మార్పిడికి బదులుగా వాటిని రద్దు చేయాలని ప్రతిపాదించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
కొత్తగా 44వేల ఇళ్లు మంజూరు
ఇటీవల సమావేశమైన సీఎ్సఎంసీ రాష్ట్రానికి 16ప్రాజెక్టు ల కింద 44,134ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో కేంద్రం వాటాకింద రూ.662.01 కోట్లు ఇవ్వనుంది. మొదటి వాయిదా కింద రూ.264.8 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. కాగా, పీఎంఏవై(యూ) కింద రాష్ట్రంలో ఖర్చు చేయని నిధులు రూ.1,758.51 కోట్లు ఉన్నాయని సీఎ్సఎంసీ వెల్లడించింది. పెండింగ్ యూసీలు త్వరగా సమర్పించాలని సూచించింది. జేఎన్ఎన్యూఆర్ఎం కింద రాష్ట్రం వద్దఉన్న అదనపు నిధులు రూ.52.08 కోట్లను వెంటనే వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ పథకం కింద నిర్మించి ఖాళీగా ఉన్న 2,757 ఇళ్లను, రాజీవ్ ఆవా్సయోజన కింద నిర్మాణంలో ఉన్న 1,535 ఇళ్లను వేగంగా పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించాలని తెలిపింది.
Updated Date - 2022-03-01T08:22:57+05:30 IST