Gujarat visit: కేజ్రీవాల్పై రాష్ట్రపతికి 30 మంది మాజీ ఐపీఎస్ అధికారుల ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-09-21T02:05:02+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సుమారు 30 మంది..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై సుమారు 30 మంది మాజీ ఐపీఎస్ అధికారులు (former IPS officers) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi murmu)కు ఫిర్యాదు (Complaint) చేశారు. ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ పర్యటనకు వచ్చిన కేజ్రీవాల్ అహ్మదాబాద్లో పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారని ఆ లేఖలో వీరు తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు.
గుజరాత్ పోలీసులపై కేజ్రీవాల్ ప్రవర్తించిన తీరును మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో వివరించారు. గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ప్రచారానికి వస్తున్నారని, విజయం కోసం ఆయా పార్టీలు ప్రచారం చేసుకోవడం కూడా సహజమేనని అన్నారు. గుజరాత్ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ ప్రచారం కోసం ఇటీవల అహ్మదాబాద్కు వచ్చారని చెప్పారు. ఒక రిక్షా కార్మికుని ఇంటికి వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆయన వెళ్లాలనుకున్నారని, ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకు, ఆయన భద్రత కోసం ఆయన వెంటే వచ్చేందుకు పోలీసు అధికారులు సిద్ధపడగా కేజ్రీవాల్ వారి సూచనలు పెడచెవిని పెట్టారని తెలిపారు. దీనికితోడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వ్యాఖ్యలు కేవలం గుజరాత్ పోలీసులను మాత్రమే కాకుండా యావద్దేశ పోలీసులను తక్కువ చేసి మాట్లాడినట్టుగా భావించాల్సి వస్తుందన్నారు. దేశంలోని పోలీసు వ్యవస్థను బలహీనపరచే వ్యాఖ్యలు మునుముందు చేయకుండా కేజ్రీవాల్ను నిలువరించేందుకు తగిన జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రవీణ్ దీక్షిత్ ఆ లేఖలో కోరారు.
Updated Date - 2022-09-21T02:05:02+05:30 IST