Fight Over Video Game: తమ్ముడిని చంపేసిన టీనేజర్.. ఎలా చంపాడో తెలుసా..
ABN, First Publish Date - 2022-05-26T23:47:57+05:30
ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లల్లో పెరిగిపోతున్న నేరప్రవృతి కలవరపరుస్తోంది. సినిమాలు, వీడియో గేమ్స్ పసిమనసులను పక్కదారిపట్టిస్తున్నాయి.
అహ్మదాబాద్: ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లల్లో పెరిగిపోతున్న నేరప్రవృతి కలవరపరుస్తోంది. సినిమాలు, వీడియో గేమ్స్ పసిమనసులను పక్కదారిపట్టిస్తున్నాయి. గుజరాత్లో వెలుగుచూసిన ఓ ఘటన పిల్లల్లో మార్పులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఫోన్లో వీడియో గేమ్ ఆడే విషయంలో అన్నదమ్ముళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ విషాదకరంగా మిగిలింది. 11 ఏళ్ల వయసున్న తమ్ముడిని 16 ఏళ్ల అన్నయ్య దారుణంగా చంపేశాడు. గుజరాత్లోని ఖేడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అన్నదమ్ముళ్లు ఇద్దరూ వంతులవారీగా సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతున్న క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. తమ్ముడి వంతు వచ్చినా మొబైల్ ఇచ్చేందుకు అన్నయ్య నిరాకరించాడు. దీంతో తమ్ముడు గొడవకు దిగాడు. మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురయిన అన్నయ్య పెద్ద రాయితో తమ్ముడి తలపై కొట్టాడు. స్పృహతప్పి పడిపోయిన అతడి శరీరానికి ఓ వైర్ సహాయంతో పెద్ద రాయిని కట్టాడు. బాడీని తీసుకెళ్లి సమీపంలోని బావిలో పడేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండానే బస్సెక్కి రాజస్థాన్లోని తమ సొంతూరికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే పిల్లలు ఇద్దరూ కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. ఆరా తీయగా పెద్దకొడుకు తమ సొంతూరికి వెళ్లాడని తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. తమ్ముడు ఎక్కడున్నాడని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. తానే తమ్ముడిని చంపేసి బావిలో పడేశానని వివరించాడు. అనూహ్యమైన ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటు చిన్నకొడుడు చనిపోగా.. అటు పెద్ద కొడుకు జైలుకెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
నిందిత మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, మర్డర్ కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. బాధిత కుటుంబం గుజరాత్కు చెందినవారు కాగా.. వ్యవసాయ పనుల కోసం సరిహద్దునే ఉన్న గుజరాత్లోని ఖేడ్ జిల్లాకు వలస వచ్చారని తెలిపారు.
Updated Date - 2022-05-26T23:47:57+05:30 IST