కేజీబీవీల్లో బోధనా సిబ్బంది బదిలీ!
ABN, First Publish Date - 2022-06-30T20:06:36+05:30
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బోధనా సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే బోధనా
అంతా కాంట్రాక్టు సిబ్బందే.. తొలిసారిగా బదిలీలు
ఐదేళ్లు దాటిన ప్రిన్సిపాళ్లకు స్థానచలనం తప్పదు
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బోధనా సిబ్బందిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే బోధనా సిబ్బందిని గతంలో ఎప్పుడూ బదిలీ చేయలేదు. 2019లో ఒకసారి బదిలీ చేసినా, వెంటనే వాటిని రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి బదిలీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 352 కేజీబీవీల్లో బోధనా సిబ్బందికి స్థానచలనం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా బదిలీలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మే 31వ తేదీ కటా్ఫగా సర్వీసును పరిగణిస్తామని, అప్పటికి ప్రస్తుత స్థానంలో రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీఈటీలు, పీజీటీలు బదిలీలకు అర్హులని పేర్కొంది. వారు ఆన్లైన్ ద్వారా రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ప్రిన్సిపాళ్లు, 8 ఏళ్లు దాటిన సీఆర్టీలు, పీఈటీలకు బదిలీ తప్పనిసరి అని పేర్కొంది.
మాకు బదిలీలేంటి?
ఈ ఉత్తర్వులపై కేజీబీవీల్లో పనిచేసే బోధనా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో నిర్వహించే ఈ విద్యాసంస్థల్లో బోధనా సిబ్బంది అంతా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. మినిమం టైమ్ స్కేల్ ప్రకారం వేతనాలు ఇస్తున్నారు. కొందరికి ఎంటీఎస్ అమలు కావడం లేదు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు వర్తించవు. అందువల్ల ఇంతవరకూ కేజీబీవీల్లో బదిలీలు చేయలేదు. కానీ ఈ ప్రభు త్వం వాటిలోనూ బదిలీలు చేపట్టడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమను బదిలీ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-06-30T20:06:36+05:30 IST