ఫీజు రీయింబర్స్మెంట్ ప్లీజ్!
ABN, First Publish Date - 2022-08-17T21:18:54+05:30
గత రెండు విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్(Fees Reimbursement), స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజు
పేరుకుపోయిన రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు
2019-20, 2020-21లలో రూ.3,350 కోట్లకుపైగా పెండింగ్
దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గత రెండు విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్(Fees Reimbursement), స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజు చెల్లించలేదని కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు(Original certificates) ఇవ్వకపోవడంతో విద్యార్థులుపై చదువులకు వెళ్లడానికి మార్గం లేకుండా పోతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్ధులు, తల్లిదండ్రులు ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు. అప్పు చేసి ఫీజులు చెల్లించిన వారు వడ్డీలు కట్టుకుంటూ రీయింబర్స్మెంట్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు రూ.3350 కోట్లకుపైగా రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 2021-22 విద్యా సంవత్సరం రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన పూర్తయితే బకాయిల మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
టోకెన్ల జారీతోనే సరి...
ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసి ముందుగా టోకెన్లు జారీ చేస్తారు. ఆ తర్వాత విద్యార్ధుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి టోకెన్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్ధుల ఖాతాలో నగదు జమ కాలేదు. అదేమిటని విద్యార్ధులు, తల్లిదండ్రులు అధికారుల్ని ప్రశ్నిస్తే త్వరలోనే ఖాతాలో నగదు జమ అవుతుందని బదులిస్తున్నారు. నెలల తరబడి విద్యార్ధులు, తల్లిదండ్రులు సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాల చుట్ట చక్కర్లు కొడుతున్నారు. కాగా, ఇటీవల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల చెల్లింపులకు వేర్వేరుగా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) విడుదల చేసింది. అయినా, నేటికీ ఒక్కపైసా విడుదల చేయలేదు. నిధుల విడుదలకు ఇంకెంత సమయం పడుతుందని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
జాడ లేని త్రైమాసిక చెల్లింపులు...
ఒకే సారి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పల చెల్లింపులు ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారడంతో వాయిదాల పద్ధతిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి(త్రైమాసికం) చెల్లిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసినా... అవి అమలులోకి రావడం లేదు. రీయింబర్స్మెంట్ విద్యాసంవత్సరం ప్రారంభంలో 25%, మధ్యలో 50%, విద్యా సంవత్సరం ముగిసే నాటికి మిగతా 25% చెల్లించాల్సి ఉన్నా... గత విద్యా సంవత్సరం ముగిసి నెలలు గడిచినా... నిధుల విడుదల ఊసే లేదు.
భారంగా అద్దె, వేతనాల చెల్లింపులు: గౌరీ సతీశ్
ప్రభుత్వం తక్షణమే ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించాలని కేజీ టూ పీజీ జేఏసీ కన్వీనర్ గౌరీ సతీశ్ డిమాండ్ చేశారు. నిర్వహణ భారంతో ఎన్నో విద్యాసంస్థలు మూతబడ్డాయని, వేలాది మంది సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. కాలేజీ భవనాల అద్దె చెల్లింపులు, బోధన, బోధనేతర సిబ్బందికి క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాల్సి రావడటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Updated Date - 2022-08-17T21:18:54+05:30 IST