ప్రాంతీయ బెంచ్లు అవసరం లేదు!
ABN, First Publish Date - 2022-09-08T06:32:42+05:30
సెప్టెంబరు 6వ తేదీ ఆంధ్రజ్యోతి సంచికలో కైలసాని శివప్రసాద్.. సత్వర న్యాయంకోసం సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు...
సెప్టెంబరు 6వ తేదీ ఆంధ్రజ్యోతి సంచికలో కైలసాని శివప్రసాద్.. సత్వర న్యాయంకోసం సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్లను ఏర్పాటు చేయాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు. అయితే న్యాయమూర్తులు పెరిగిన విషయాన్ని ఆయన విస్మరించారు. రెండవది రాష్ట్రాలను విడగొట్టడం ద్వారా హైకోర్టులు, జిల్లా కోర్టుల సంఖ్య కూడా పెరిగింది. మూడవది కుటుంబ కోర్టులని, డెట్ రికవరీ ట్రైబ్యునల్స్, మానవ హక్కుల పరిరక్షణ కమిషన్, పోస్కో న్యాయస్థానం ఇలా చాలా కోర్టులు వచ్చాయి. నాల్గవది మన జనాభాలో అత్యధికులు తాము అనుకున్న రీతిలో తీర్పు రాకుంటే జిల్లా కోర్టు తీర్పును హైకోర్టుకు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లాలని చూస్తుంటారు. ఐదవది సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్లు ఏర్పాటు చేసినా కక్షిదారులు రేపు ఆ ప్రాంతీయ బెంచ్ తీర్పును ఢిల్లీలో ఉండే ప్రధాన బెంచ్కు ఏదో ఒక కారణంతో తీసుకుని వెళ్లరా? ఇక ఆరవది ఆ ప్రాంతీయ బెంచ్లు ఒకే విషయంలో విరుద్ధ తీర్పులిచ్చే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి ఇంకా సంక్లిష్టమవుతుంది. మరో విషయం, ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో రోజూ అనేక ధర్మాసనాలు (బెంచ్లు) సమావేశమవుతున్నాయి. ప్రాంతీయ బెంచ్ లంటే ఆ ధర్మాసనాలనే పలు ప్రాంతాలకు సర్దవలసి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తులు, సిబ్బంది ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటు అవసరం లేదు.
పింగళి రఘునాథ్, న్యాయవాది
Updated Date - 2022-09-08T06:32:42+05:30 IST