Fire accident: శుభకార్యంలో అశుభం
ABN, First Publish Date - 2022-12-13T08:03:08+05:30
తిరువణ్ణామలై(Tiruvannamalai) జిల్లా వందవాసి వద్ద సోమవారం వేకువజామున ఓ టూరిస్టు బస్సు టైర్ పంక్చరై,
- పెళ్లి బృందం బస్సు దగ్ధం
- ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
చెన్నై, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరువణ్ణామలై(Tiruvannamalai) జిల్లా వందవాసి వద్ద సోమవారం వేకువజామున ఓ టూరిస్టు బస్సు టైర్ పంక్చరై, ఫ్లైఓవర్ పిట్టగోడను ఢీకొని మంటలు చెలరేగటంతో దగ్ధమైంది. ఆ సమయంలో అటు వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సు అద్దాలను పగులగొట్టి అందులోని 40 మంది ప్రయాణికులను రక్షించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా... చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కంలో వెంకటేశన్ అనే యువకుడి వివాహ రిసెప్షన్ వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి. ఆ వేడుకల్లో పాల్గొన్న వధువు తరఫు బంధువులు, స్నేహితులు సహా 40 మంది మగపెళ్లివారు ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో కాంచీపురం(Kanchipuram)లోని విడిదిలో బస చేసేందుకు బయలుదేరారు. ఆ బస్సు వందవాసి సమీపంలో వెళ్తుండగా కుడివైపు టైర్ పంక్చరైంది. దీంతో అదుపు తప్పిన ఆ బస్సు ఫ్లైఓవర్ పిట్టగోడను ఢీకొనటడంతో డీజిల్ ట్యాంక్ పేలి నలువైపులా మంటలు చెలరేగాయి. బస్సులోని వారంతా ప్రాణభయంతో కేకలు పెట్టసాగారు. వారంతా బస్సులో నుంచి దిగేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఎసీ బస్సు కావటంతో కిటికీ అద్దాలు కూడా తెరవలేకపోయారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న లారీ డ్రైవర్ బస్సు మంటల్లో కాలిపోవడం చూసి వెంటనే లారీ ఆపి టూల్ బాక్స్లోని ఇనుపరాడ్తో బస్సు కిటికీ అద్దాలన్నింటిని పగులగొట్టాడు. ఆ తర్వాత కిటికీల గుండా ప్రయాణికులందరూ కిందకు దిగారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని వెంటనే అంబులెన్స్ ద్వారా వందవాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్ళి మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఆ బస్సు పూర్తిగా దగ్ధమైంది. వందవాసి నార్త్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-12-13T08:03:09+05:30 IST