Arrest: బ్యాంకు దోపిడీ కేసులో మరొకరి అరెస్టు
ABN, First Publish Date - 2022-08-17T15:29:08+05:30
స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్ బ్యాంక్ దోపిడీ(Bank robbery) కేసులో పోలీసులు మరికొంత పురోగతి సాధించారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు
- మొత్తం నగలు స్వాధీనం
- మరో ఇద్దరి కోసం గాలింపు
చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్ బ్యాంక్ దోపిడీ(Bank robbery) కేసులో పోలీసులు మరికొంత పురోగతి సాధించారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, మరొకరిని కూడా అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ దోపిడీ జరిగిన వెంటనే సూర్య అనే వ్యక్తి 14 కేజీల బంగారు నగలతో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి ఆర్ఎస్ పురంలోని ఓ నగల దుకాణంలో వాటిని కరిగించాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో సత్వరం స్పందించిన పోలీసులు.. ఆ నగల దుకాణం యజమానిని అరెస్టు చేశారు. సూర్య నుంచి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దోపిడీకి గురైన మొత్తం నగలు స్వాధీనమైనట్లు గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ శంకర్జివాల్(Shankarjiwal) ప్రకటించారు. ఈ దోపిడీకేసును సమర్థవంతంగా విచారణ జరిపి అతి తక్కువ సమయంలోనే ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసిన ప్రత్యేక దళాన్ని ఆయన అభినందించారు. ఒకటి రెండురోజుల్లోగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం అరెస్టయిన బ్యాంక్ దోపిడీ సూత్రధారి మురుగన్ను పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీలో ఏడుగురే కాకుండా ఇంకా ఎవరికైనా సంబంధాలున్నాయేమోనని ఆరా తీస్తున్నారు.
Updated Date - 2022-08-17T15:29:08+05:30 IST