రేట్లు యథాతథం
ABN, First Publish Date - 2022-02-11T08:05:57+05:30
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రెపో రేటు చారిత్రక కనిష్ఠ స్థాయి 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. కీలక రేట్లను యథాతథ స్థితిలో..
- రికార్డు కనిష్ఠ స్థాయిలో వరుసగా పదోసారి..
- రెపో రేటు 4% .. రివర్స్ రెపో 3.35%
- మరికొంత కాలం సర్దుబాటు ధోరణి కొనసాగింపు
- కొత్త ఏడాదికి ద్రవ్యోల్బణ అంచనా 4.5 శాతం
- వృద్ధి రేటు అంచనా 7.8 శాతం
- పెరుగుతున్న క్రూడ్ ధరలతో పెను సవాలు
- తదుపరి ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 6-8
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో రెపో రేటు చారిత్రక కనిష్ఠ స్థాయి 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. కీలక రేట్లను యథాతథ స్థితిలో కొనసాగించడం వరుసగా ఇది పదోసారి. 2020 ఆగస్టు తర్వాత కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కమిటీ నిర్ణయాలను గురువారం ప్రకటించారు. ఎంపీసీ సభ్యులు ఆరుగురిలో ఐదుగురు రెపో రేట్లలో యథాతథ స్థితికి మద్దతు ప్రకటించారన్నారు. వృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా అవసరమైనంత కాలం సర్దుబాటు ధోరణి కొనసాగించనున్నట్టు చెప్పారు. ద్రవ్య, ఆర్థిక విధానాలు ‘దేని దారి దానిదే’ అన్నట్టుగా సాగే రోజులు కావని, ఆ రెండూ పరస్పర సమన్వయపూర్వకంగా కలిసి అడుగేయాల్సిన అవసరాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి, ఒమైక్రాన్తో ఏర్పడిన అస్థిరతలు, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రికవరీ అన్ని రంగాలకు విస్తరించి.. స్థిరంగా కొనసాగే వరకు మద్దతు కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించిందన్నారు. ఈ లోగా ద్రవ్య విధానం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ద్రవ్యోల్బణానికి ‘చమురు’ ముప్పు
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండవచ్చు. అయితే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు మాత్రం ద్రవ్యోల్బణాన్ని పోటెత్తించే ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం సంకేతాలను బట్టి వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం వద్ద స్థిరం కావచ్చు. ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ పరిధి (6 శాతం) కన్నా ఈ అంచనా చాలా దిగువనే ఉంది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.3 శాతంగా ఉండవచ్చు.
వృద్ధి రేటు
కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతం ఉండవచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేస్తున్న 9.2 శాతం కన్నా ఇది చాలా దిగువ స్థాయి. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో పార్లమెంటు కు సమర్పించిన ఆర్థిక సర్వేలో ప్రకటించిన అంచనా 8.5 శాతం కన్నా కూడా తక్కువ. దేశంలో ఆర్థిక కార్యకలాపాల రికవరీ ఇంకా అన్ని రంగాలకు విస్తరించాల్సి ఉంది. అంతేకాదు ప్రైవేటు వినియోగం, కాంటాక్ట్ ఆధారిత సేవలు కరోనా ముందు స్థాయి కన్నా చాలా దిగువనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆటుపోట్లు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు ప్రత్యేకించి క్రూడాయిల్ ధరల పెరుగుదల ధోరణులు, సరఫరాపరమైన అవరోధాలు వృద్ధి రేటుకు సవాలుగా ఉండవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికాల వారీగా వృద్ధి రేటు ఇలా ఉండవచ్చు. క్యూ1:17.2%, క్యూ2:7%, క్యూ3: 4.3%, క్యూ4: 4.5%.
బ్యాంకులు
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మూలధన నిల్వలు పెంచుకోవాలి. భవిష్యత్ అవసరాలకు సరిపడేంతగా నిధులు సిద్ధంగా ఉంచుకోవాలి. సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా లిక్విడిటీ అవరోధాలు తొలగించేందుకు, మార్కెట్ విశ్వాసం ఇనుమడింపచేసేందుకు తీసుకున్న చర్యల ప్రభావంతో ఫైనాన్షియల్ మార్కె ట్లు స్థిరంగా ఉన్నాయి. మెరుగైన సీఏఆర్, ఎన్పీఏల తగ్గుదల, మెరుగుపడిన లాభదాయకతతో వాణిజ్య బ్యాంకుల పద్దులు బలంగా ఉన్నాయి.
వాలంటరీ రిటెన్షన్ రూట్
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) చూపుతున్న ఆసక్తిని పరిగణనలోకి తీసుకుని వాలంటరీ రిటెన్షన్ రూట్ (వీఆర్ఆర్) పరిమితిని రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్లకు పెంచారు. సంపన్న దేశాల్లో పాలసీ రేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎఫ్పీఐలు ఆ మార్కెట్ల వైపు ఆకర్షితులవుతున్న కారణంగా వారిని నిలువరించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అలాగే క్రెడిట్ డీఫాల్ట్ స్వాప్ (సీడీఎ్స)కు సమీక్షానంతర మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తారు. 9 ఏళ్ల తర్వాత మార్గదర్శకాల సవరణ జరుగుతోంది. కార్పొరేట్ బాండ్లు ప్రత్యేకించి తక్కువ రేటు బాండ్లకు లిక్విడ్ మార్కెట్ అభివృద్ధి కావడానికి సీడీఎస్ దోహదపడుతుంది.
డిజిటల్ కరెన్సీపై ఇంకా ఆలోచిస్తున్నాం..
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రవేశపెట్టడంతో సంబంధం ఉన్న అన్ని అంశాలను తాము జాగ్రత్తగా మదింపు చేస్తున్నామని దాస్ చెప్పారు. ప్రధానంగా దానికి సైబర్ సెక్యూరిటీ, నకిలీల సృష్టి వంటి పెద్ద రిస్క్లున్నాయని ఆయన వివరించారు. సీబీడీసీ ఎప్పుడు ప్రవేశపెడతారనే విషయంలో ఒక గడువు చెప్పడానికి నిరాకరిస్తూ తొందరపడేది లేదని స్పష్టం చేశారు.
క్రిప్టోలు ప్రమాదం సుమా
క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని చెబుతూ వాటిలో ఇన్వెస్ట్ చేసే వారు అప్రమత్తంగా ఉండాలని దాస్ హెచ్చరించారు. 17వ శతాబ్ది కాలం నాటి ‘తులిప్ వ్యామోహం’తో క్రిప్టోలపై ఆసక్తిని ఆయన సరిపోల్చారు. క్రిప్టో కరెన్సీలు ఆ తులిప్ పూల విలువ కూడా చేయవని ఆయన అన్నారు. క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసే వారు సొంత రిస్క్తోనే ఇన్వెస్ట్ చేయాలని ఆయన సూచించారు. విలువలు సహజంగా కాకుండా లాభాపేక్షతో స్పెక్యులేటర్లు చేసే మతలబుల కారణంగా పెరగడాన్నే తులిప్ వ్యామోహంగా చెబుతారు.
ఈ-రూపీ వోచర్ల పరిమితి రూ.లక్షకు పెంపు
దేశంలో ఈ-రూపీ డిజిటల్ వోచర్ల పరిమితిని ఆర్బీఐ రూ.10,000 నుంచి రూ.లక్షకు పెంచింది. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు డిజిటల్గా అందించేందుకు పలు విడతలుగా దీన్ని వినియోగించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ-రూపీ డిజిటల్ వోచర్ను గత ఆగస్టులో విడుదల చేశారు. ఈ-రూపీ వోచర్లు పొందిన లబ్ధిదారులు కార్డుతో అవసరం లేకుండా దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత. ఇవి స్వభావరీత్యా గిఫ్ట్ కార్డుల వంటివే. ఇప్పటి వరకు ఈ వోచర్లోని మొత్తాన్ని ఒకే ఒకసారి నగదుగా మార్చుకోవాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో వోచర్లోని మొత్తం నుంచి ఎన్నిసార్లైనా నగదును తీసుకోవచ్చు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో చెల్లించే సొమ్ము తేలిగ్గా బట్వాడా చేసేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది.
ఆరోగ్య రంగానికి మరో 3 నెలలు మద్దతు
అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గతంలో ప్రకటించిన రూ.50,000 కోట్ల టర్మ్ లిక్విడిటీ మద్దతును మరో మూడు నెలలు పొడిగించారు. తాజా నిర్ణయం ప్రకారం ఈ మద్దతు ఈ ఏడాది జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. కొవిడ్-19 విజృంభణ సమయంలో ఆరోగ్య రక్షణ రంగానికి మద్దతు ఇచ్చేందుకు గత ఏడాది మే నెలలో ఆర్బీఐ ఈ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ కింద అవసరం ఉన్న కంపెనీలు మూడేళ్ల కాలపరిమితికి రెపో రేటుతో సమానమైన వడ్డీకి రుణం పొందవచ్చు. ఇందుకోసం బ్యాంకులు కొవిడ్-19 రుణ పద్దు ప్రత్యేకంగా నిర్వహించుకోవలసి ఉంటుంది.
త్వరలో డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు
ఆన్లైన్ వేదికలు, మొబైల్ యాప్ల ద్వారా జరిగే డిజిటల్ లెండింగ్కు ఆర్బీఐ త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ అంశంపై అధ్యయనానికి నియమించిన కార్యాచరణ బృందం ఆర్బీఐకి ఇప్పటికే సిఫారసులు అందించింది. దీనిపై ఆసక్తి గల వర్గాల నుంచి సలహాలు, సూచనలు ఇచ్చే గడువు డిసెంబరు 31తో ముగిసింది. కమిటీ సిఫారసులు, సూచనల ఆధారంగా మార్గదర్శకాల తయారీ కృషి ప్రస్తుతం జరుగుతోంది. రిటైల్ చెల్లింపుల వ్యవస్థకు నాయకత్వంగా నిలిచే వ్యవస్థ ఏర్పాటుపై కూడా కృషి జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తులు అందాయి. వాటి నుంచి ఎంపిక చేసిన సంస్థ పేరు ప్రకటించాల్సి ఉంది.
Updated Date - 2022-02-11T08:05:57+05:30 IST