ఊహించినట్టుగానే షాకిచ్చిన RBI.. భారీగా పెరిగిన Repo rate..
ABN, First Publish Date - 2022-08-05T17:14:39+05:30
ఊహించినట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లు పెంచేసింది. రెపో రేటు(Repo Rate)ను
RBI : ఊహించినట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లు పెంచేసింది. రెపో రేటు(Repo Rate)ను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. మూడు రోజులుగా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమీక్ష సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governer Shaktikanta Das) అధ్యక్షతన జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించింది. 35 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటును పెంపుదల చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.
అంచనాలకు తగ్గట్టుగానే ఆర్బీఐ ఏకంగా వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు(Basis Points) పెంచింది. 100 బేసిస్ పాయింట్లు ఒక శాతం లేదా ఒక రూపాయికి సమానం. అంటే ఇప్పుడు వడ్డీ రేటు(Interest Rate) 50 పైసలు పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇప్పటికే మే-జూన్ నెలల్లో రెండు విడతలుగా రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచింది. దీంతో గత రెండు నెలల్లో అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లు పెంచాయి. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై నెలనెలా చెల్లించే ఈఎంఐల భారం మరింత పెరగనుంది.
రెపో రేటు అంటే?
బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీని రెపో రేటు అంటారు. ఇప్పుడు రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేటు పెరిగితే, బ్యాంకులు ఖాతాదారులకు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా వినియోగదారులకు ఈఎంఐ భారంగా మారనుంది. గృహ రుణాలు(Housing Loans), వ్యక్తిగత రుణాలు(Personal Loans), ఇతర రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్త రుణగ్రహీతలకు అధిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారంగా మారతాయి.
Updated Date - 2022-08-05T17:14:39+05:30 IST