అదానీ చేతికి ఏపీ టోల్ ప్రాజెక్టులు
ABN, First Publish Date - 2022-08-05T06:14:37+05:30
అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల్లో 972 కిలోమీటర్ల పొడవైన నాలుగు టోల్వే ప్రాజెక్టులను
రెండు గుజరాత్ ప్రాజెక్టులు కూడా
డీల్ విలువ రూ.3,110 కోట్లు
ఏపీ ఇన్ఫ్రాపై పట్టు బిగిస్తున్న అదానీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల్లో 972 కిలోమీటర్ల పొడవైన నాలుగు టోల్వే ప్రాజెక్టులను రూ.3,110 కోట్లతో కొనుగోలు చేస్తోంది. మక్వారీ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనుబంధ సంస్థలైన.. గుజరాత్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (జీఆర్ఐసీఎల్), స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్టీపీఎల్) నుంచి అదానీ గ్రూప్ ఈ నాలుగు టోల్వేలను కొనుగోలు చేస్తోంది. ఇందు లో ఎస్టీపీఎల్కు ఆంధ్రప్రదేశ్లోని రెండు టోల్వే ప్రాజెక్టు ల్లో నూరు శాతం వాటా ఉంది. గుజరాత్లోని రెండు టోల్వే ప్రాజెక్టుల్లో మాత్రం జీఆర్ఐసీఎల్కు 56.8 శాతం మాత్రమే వాటా ఉంది. ఈ రెండు కంపెనీల్లోని మక్వారీ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వాటాలను.. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) అనుబంధ సంస్థ అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) ద్వారా కొనుగోలు చేస్తోంది. దేశ పశ్చిమ-దక్షిణ ప్రాంతాలను కలిపే ఈ నాలుగు టోల్ ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా తమకు అత్యంత కీలక ప్రాజెక్టులవుతాయని అదానీ గ్రూప్ తెలిపింది.
ఏపీపై ప్రత్యేక దృష్టి: ఆంధ్రప్రదేశ్లోని తడ-నెల్లూరు (110 కిలోమీటర్లు), నందిగామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ (48 కిలోమీటర్లు) ప్రాజెక్టులు అదానీ గ్రూప్నకు మరింత కీలకం కానున్నాయి. ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం రేవులను అదానీ గ్రూప్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలోని ప్రధాన టోల్వే ప్రాజెక్టులను చేజిక్కించు కుంది. కాగా ప్రధాన రేవులకు సమీపంలోని అన్ని జాతీయ రహదారులపై పట్టు సాధించే దిశగా అదానీ గ్రూప్ అడుగులు వేస్తోందని భావిస్తున్నారు.
తడ- నెల్లూరు టోల్వే బంగారు బాతే: తడ-నెల్లూరు టోల్వే ప్రాజెక్ట్ అదానీ గ్రూప్నకు ఆర్థికంగా బంగారు బాతు కానుంది. ఈ 110 కిలోమీటర్ల పొడవైన టోల్వేలో మొత్తం మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. కృష్ణపట్నం రేవుకు వచ్చిపోయే వాహనాలతో పాటు ఏపీ నుంచి చెన్నై వచ్చిపోయే వాహనాలతో ఈ రహదారి ఎప్పుడూ బిజీగా ఉంటుంది. దీంతో ఈ టోల్వే ద్వారా వెళ్లే వాహనాల టోల్ కలెక్షన్లూ ఇక అదానీ గ్రూప్ ఖాతాలో పడనున్నాయి.
నందిగామ-విజయవాడ టోల్వే: విజయవాడ సమీపంలోని నందిగామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ టోల్ ప్రాజెక్ట్ ద్వారానూ అదానీ గ్రూప్నకు మంచి ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. దక్షిణ భారత్లోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానం చేసే ఈ రహదారి దగ్గరిలోని చెన్నై-కోల్కకతా జాతీయ రహదారి (ఎన్హెచ్-16) ట్రాఫిక్కు ప్రధాన ఊతం. రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతి లభిస్తే వచ్చే నెలాఖరుకల్లా ఏపీ, గుజరాత్ల్లోని ఈ నాలుగు టోల్వేలు అదానీ గ్రూప్ చేతికి వస్తాయి.
కాగా ఏపీతో పాటు స్వరాష్ట్రమైన గుజరాత్లోని రెండు కీలక టోల్ ప్రాజెక్టులనూ అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. 51.6 కిలోమీటర్లతో బాగా రద్దీగా ఉండే అహ్మదాబాద్-మెహసాన, 31.7 కిలోమీటర్ల పొడవైన వడోదర-హలోల్ టోల్వే ప్రాజెక్టులూ అదానీ గ్రూప్ చేతికి రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్కు దగ్గర్లోనే ఉన్నాయి.
Updated Date - 2022-08-05T06:14:37+05:30 IST