రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు: వర్ల రామయ్య
ABN, First Publish Date - 2022-03-12T01:42:34+05:30
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరవైందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.
విజయవాడ: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరవైందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మొన్న నెల్లూరులో విదేశీ మహిళపై దాడి, నిన్న మచిలీపట్నంలో ప్రేమజంటలోని యువకుడిని స్తంభానికి కట్టేసి, యువతిపై సామూహిక అత్యాచారం చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల లేమికి నిదర్శనం. పాలకులు కళ్లు తెరవాలి’ అంటూ వర్ల ట్వీట్ చేశారు. ‘నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు మోటారు సైకిల్ మీద హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడని అక్కడ పోలీసు అధికారి ఆ యువకుడిని చొక్కా పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. విచిత్రమేమిటంటే.. ఆ సమయంలోనే, ఒక పోలీసు అధికారి హెల్మెట్ లేకుండా మోటారు సైకిల్ నడుపుకుంటూ ఈ అధికారిని పలుకరిస్తాడు. అతనిపై నో యాక్షన్.. ఇదెలా?’ అంటూ వర్ల రామయ్య మరో ట్వీట్లో ప్రశ్నించారు.
Updated Date - 2022-03-12T01:42:34+05:30 IST