ఎందుకీ గుండెపోట్లు?
ABN, First Publish Date - 2022-06-07T10:14:15+05:30
అప్పటిదాకా స్టేజి మీద పాటలు పాడుతూ ఆహూతులను ఉర్రూతలూగించిన సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్)..
- కుప్పకూలుతున్న ఆరోగ్యవంతులు
- కొవిడ్ వల్లా? కరోనా టీకాల వల్లా?
- వ్యాక్సినేషన్ కారణంగా బ్లడ్ క్లాట్లు
- యాంటీబాడీల దాడితో రక్తంలో గడ్డలు
- టీకాలతో దుష్ప్రభావాలున్నా..స్వల్పమే
- ప్రయోజనాలే ఎక్కువ: పరిశోధకులు
అప్పటిదాకా స్టేజి మీద పాటలు పాడుతూ ఆహూతులను ఉర్రూతలూగించిన సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్).. అంతలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు! అంతకు ముందు.. ఫిట్నెస్ కోసం నిత్యం కసరత్తులు చేసే ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్.. ఇద్దరూ హఠాత్తుగా హృద్రోగ సమస్యలతోనే నేలకొరిగారు. గమనిస్తే.. ఇటీవలికాలంలో 40-50ఏళ్ల వయసువారిలో చాలామంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వైద్యులను కలవరపరుస్తోంది. రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 మహమ్మారి జోరు తగ్గాక.. నమోదవుతున్న ఇలాంటి హఠాన్మరణాలు పలు సందేహాలకు కారణమవుతున్నాయి. కొవిడ్-19 కారణంగా కొందరిలో గుండెపై తీవ్ర ప్రభావం పడుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడి కాగా.. వ్యాక్సిన్ల వల్ల కూడా రక్తంలో గడ్డలు ఏర్పడి గుండెపోటు, బ్రెయిన్స్ట్రోక్ వంటివి సంభవిస్తున్నాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కరోనా బారిన పడినవారిలో సీ-రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్పీ), డి-డైమర్ స్థాయులు ఎక్కువగా నమోదైతే వారికి ఈ సమస్యలు ఎదురయ్యే ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. కేకే, గౌతమ్ రెడ్డి, పునీత్ వంటివారిలో జరిగింది ఇదేనని కొవిడ్ వైద్య నిపుణుడు డాక్టర్ ఆశిష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్ల వల్ల కూడా గుండె వాపునకు గురవుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదాహరణకు.. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వేయించుకున్నవారిలో కొద్దిమందికి మయోకార్డైటిస్ (గుండె వాపు), గుండె కండరాల మధ్య పొరలో వాపు వంటి దుష్ప్రభావాలు వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు వచ్చినవారు అలసట, ఛాతీనొప్పి, హృదయ స్పందనల్లో లోపాలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన ప్రెడిక్టివ్ హెల్త్ డయాగ్నస్టిక్స్ సంస్థ గత ఏడాది అమెరికాలో 566 మందిపై ఒక అధ్యయనం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, వ్యాక్సిన్ తీసుకున్నాక వారి గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి‘పల్స్’ కార్డియాక్ టెస్ట్ చేసింది. ‘పల్స్’ అంటే.. ‘ప్రొటీన్ అన్స్టేబుల్ లెజియన్ సిగ్నేచర్’. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తనమూనాలో తొమ్మిది రకాల మార్కర్లను ఈ పరీక్షలో గుర్తిస్తారు.
వాటి స్థాయులు ఎక్కువగా ఉంటే వచ్చే ఐదేళ్లలో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ. తక్కువ ఉంటే ఆ అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి.. వ్యాక్సిన్ (ఎంఆర్ఎన్ఏ) తీసుకున్నాక తొమ్మిది రకాల మార్కర్లలో మూడింటి స్థాయులు పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే, అమెరికా వైద్యనిపుణులు చాలా మంది ఈ అధ్యయనంపై విమర్శలు చేశారు. ఆ స్టడీ చేసిన తీరులోనే పలు లోపాలున్నాయని.. ఆ ఫలితాల్ని పట్టించుకోనక్కర్లేదని కొట్టిపారేశారు. అయితే, అధికారిక గణాంకాల ప్రకారమే అమెరికాలో 2020 డిసెంబరు నుంచి 2021 ఆగస్టు దాకా 35.4 కోట్ల డోసుల టీకా ఇవ్వగా.. 1626 మంది గుండెవాపు దుష్ప్రభావంతో బాధపడ్డారు. నలభై ఏళ్లలోపువారిలో ఈ కేసులు ఎక్కువగా రావడంతో అమెరికా ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ కూడా గత ఏడాది ఈ సమస్యపై దృష్టి సారించింది.
ఆస్ట్రాజెనెకా టీకాపై నిషేధాస్త్రం
మనదేశంలో విస్తృతంగా వేసిన టీకాలు రెండే. ఒకటి.. కొవిషీల్డ్. రెండు.. కొవ్యాక్సిన్. ఈ రెండింటిలోనూ టీకా కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా ఉపయోగించింది ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ టీకానే. ఇదే టీకాను యూకేలో, యూర్పలో వేరే పేరుతో విక్రయించారు. కానీ.. ఈ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకడుతుండడంతో దీని వాడకాన్ని డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర 12 దేశాలు నిలిపివేశాయి. అమెరికాలో ఈ టీకాను అసలు ఎవరికీ వేయలేదు. బ్లడ్ క్లాట్ల ముప్పు నేపథ్యంలో పలు దేశాలు ఈ టీకా ఇవ్వడాన్ని నిలిపివేయడంతో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) దీనిపై కొన్నివారాలపాటు పరిశోధనలు జరిపి.. ఈ టీకాకు, దాన్ని వేసుకున్నవారిలో రక్తం గడ్డ కట్టడానికి మధ్య సంబంధం ఉందని గతేడాది ఏప్రిల్ 7న ఒక ప్రకటన చేసింది. అదే సమయంలో.. టీకా వేసుకోకపోవడం వల్ల కలిగే నష్టంతో పోలిస్తే, ఆస్ట్రాజెనెకా టీకా వేసుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలే ఎక్కువని స్పష్టం చేసింది.
రక్తం గడ్డలు ఎందుకు?: వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల కలిగే ముప్పుతో పోలిస్తే వ్యాక్సిన్ల వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువని, దుష్ప్రభావాలు స్వల్పాతిస్వల్పంగా అతి తక్కువ మందిలోనే కనపడుతున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారుగానీ.. అసలు ఆస్ట్రాజెనెకా టీకా వల్ల రక్తం ఎందుకు గడ్డలు కడుతోంది? అనే ప్రశ్నకు 2021 డిసెంబరులో కొందరు శాస్త్రజ్ఞులు గుర్తించారు. వారు చెబుతున్నదాని ప్రకారం.. టీకాను కండరంలోకి ఇచ్చే క్రమంలో కొందరిలో అది రక్తంలోకి లీక్ అవుతోంది. అలా కలవగానే.. రక్తంలో ఉండే ‘ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4’ అనే ప్రొటీన్, టీకా వాహకమైన అడినోవైర్సకు ఆకర్షితమవుతోంది. దీంతో ఆ ప్రొటీన్ను వైరస్ శరీరంలో భాగంగా రోగనిరోధక వ్యవస్థ భావిస్తుంది. వాటిపై దాడికి యాంటీబాడీలను విడుదల చేస్తుంది. అవి శరీరంలో ఎక్కడ ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 ప్రొటీన్లు ఉంటే అక్కడ వాటిని చుట్టుముడతాయి. అయితే బ్రిటన్లో 5కోట్ల డోసులు ఇస్తే 73 మందిలోనే ఈ దుష్ప్రభావం కనిపించిందని, అదే సమయంలో ఆ టీకా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిందని శాస్త్రజ్ఞులు గుర్తుచేస్తున్నారు. - సెంట్రల్ డెస్క్
ఆ సమాచారం ఇవ్వలేం
కొవ్యాక్సిన్, కొవిషీల్డ్ టీకాల ప్రయోగ పరీక్షల సమాచారాన్ని, వ్యాక్సినేషన్ వల్ల కలిగిన దుష్ప్రభావాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఆ సమాచారాన్ని వెల్లడించలేమని భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మార్చిలోనే సుప్రీంకోర్టుకు వెల్లడించాయి. ఆ సమాచారం ఔషధ నియంత్రణ సంస్థలకు అందుబాటులో ఉంటే సరిపోతుందని ఆ కంపెనీలూ పేర్కొన్నాయి.
Updated Date - 2022-06-07T10:14:15+05:30 IST