సీటు..పోటు!
ABN, First Publish Date - 2022-09-23T05:36:59+05:30
ఇంజనీరింగ్ కళాశాలలను ప్రభుత్వం చావు దెబ్బతీస్తోంది.
ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లు రద్దు
ప్రభుత్వ గుప్పిట్లో సీట్లు.. మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసేందుకు కసరత్తు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇంజనీరింగ్ కళాశాలలను ప్రభుత్వం చావు దెబ్బతీస్తోంది. ఫీజుల నుంచి సీట్ల భర్తీ వరకు కమిటీ సిఫారసులను, న్యాయస్థానాల ఆదేశా లను బేఖాతరు చేస్తోంది. తాజాగా ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లను రద్దు చేసింది. ఎన్ఆర్ఐ కోటా మాత్రం ఉంచింది. ప్రస్తుతం ఎన్ఆర్ఐ సీట్లను యాజమాన్యాలు సొంతంగా భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు విద్యార్థులు వెళుతుంటారు. విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయులు రాష్ట్రంలో చేరేది ఉండదు. ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందోగానీ తాజా నిర్ణయం తో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. గతంలో మేనేజ్ మెంట్ కోటా 15 శాతం, ఎన్ఆర్ఐ కోటా రెండు శాతం, ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా 13 శాతం ఉండేది. అంటే కళాశాల మొత్తం సీట్లలో 30 శాతం యాజమాన్యాలు భర్తీ చేసుకునే వెసులుబాటు ఉండేది. మేనేజ్మెంట్ భర్తీ చేసుకునే సీట్లకు సంబం ధించి ఫీజులను కళాశాలలే నిర్ధారించుకునేవి. కోర్సు డిమాండ్, కళాశా లల స్థాయిని బట్టి ఫీజులు అమలులో ఉండేవి. ప్రభుత్వం దానిపై కన్నేసింది. మేనేజ్మెంట్ కోటాలోనూ ప్రభుత్వమే ఫీజులను నిర్ధారిం చింది. కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యే సీట్ల ఫీజులకు మూడింతలు మేనేజ్మెంట్ కోటా సీట్లకు వసూలు చేసుకోవాలని ప్రభుత్వం సూచిం చింది. మరోవైపు కన్వీనర్ కోటా ఫీజునే తగ్గించేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫీజుల నిర్ధారణ కమిటీ సిఫారసులను అమలు చేసేవారు. జిల్లాలో కన్వీనర్ కోటాలోనే గరిష్ఠంగా రూ.1.10 లక్షల ఫీజు ఉన్న కళాశాలలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల్లో కోత విధించింది. జిల్లాలో అత్యధిక ఫీజును రూ.73 వేలుగా నిర్ణయించింది. అంతకు మూడు రెట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. సీట్లను కన్వీనరే మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. కళాశాలలకు ఇది పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. ఎవరికి సీటు వస్తుందో... ఎవరికి రాదో తెలియని పరిస్థితి. గతంలో మేనేజ్ మెంట్ కోటాపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది కాదు. దాంతో కళాశాలలే విద్యార్థుల ర్యాంకులు, ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని సీట్లు కేటాయించేవి. ఫీజులను తమకు తోచిన రీతిలో వసూలు చేసేవి. ప్రస్తుత ప్రభుత్వం పాత విధానాన్ని తుంగలో తొక్కింది. మేనేజ్మెంట్ కోటాపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండకూడదంటూ న్యాయస్థానాలు ఆదేశించాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. కన్వీనరే వీటిని భర్తీ చేస్తున్నారు.
రద్దయిన సీట్లు మేనేజ్మెంట్ కోటాకే..
ప్రభుత్వం ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్ల రద్దు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. అన్ని సీట్లు తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్ల భర్తీని గతేడాది ప్రభుత్వమే నిర్వహించింది. ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లను మాత్రం కళాశాలలు నిర్వహించుకున్నాయి. సొంతంగా ఫీజు కట్టుకునే స్తోమత ఉన్న విద్యార్థులు ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేస్తున్న ట్టుగా దరఖాస్తు చేసుకునేవారు. కళాశాలల ఫీజులను సొంతంగానే చెల్లిం చుకునేవారు. ఇది బహిరంగ రహస్యం. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం కన్ను పడింది. కళాశాలలు లబ్ధి పొందుతున్నా యన్న ఉద్దేశంతో ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లను రద్దు చేసింది. వాటిని మేనేజ్ మెంట్ కోటాలో చేర్చనుం ది. తద్వారా ప్రభుత్వమే ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లను భర్తీ చేసేలా నిర్ణ యం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులు కళాశాలలకు ఫీజులు చెల్లించేశారు. డిమాండ్ ఉన్న కళాశాలల్లో కొన్ని కోర్సులకు సీట్లు హాట్ కేకుల్లా అయిపో యాయి. విద్యార్థులు రిజర్వ్ చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించే మెరిట్ కౌన్సెలింగ్లో మేనేజ్మెంట్ సీటు వస్తుందన్న ఉద్దేశంతో ముందుగానే రిజర్వ్ చేసుకుని ఫీజులను చెల్లించేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో అటు విద్యార్థులు, ఇటు యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
జిల్లాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే డిమాండ్ అధికంగా ఉంది. మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సీట్లలోనూ ఆ కోర్సుకే విద్యార్థులు మొగ్గుచూపారు. ప్రభుత్వం నిర్ధారించిన మేనేజ్మెంట్ ఫీజుకంటే అధికంగా చెల్లించేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. ఇతర కోర్సుల్లో చేరేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కన్వీనర్ కోటాలో ఫ్రీ సీటు ఫీజును వసూలు చేసేందుకే యాజమాన్యాలు మల్లగుల్లాలు పడ్డాయి, సివిల్, మెకానికల్ వంటి కోర్సుల్లో ఇటువంటి దుస్థితి ఏర్పడింది. విద్యార్థులు చేరేందుకు అంతగా ఆసక్తి చూప లేదు. అయినా ప్రభుత్వం ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్లు రద్దు, మేనేజ్మెంట్ కోటాను కన్వీనర్ ఆధ్వర్యంలో భర్తీ వంటి నిర్ణయాలు తీసుకుంది. కళాశాలలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు నాణ్యమైన విద్యను అందించకపోతే చర్యలు తప్పవంటూ సంకేతాలు పంపుతోంది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో ఇంజనీరింగ్ కళాశాలలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.
Updated Date - 2022-09-23T05:36:59+05:30 IST