బండి ముత్యాలమ్మ ఉత్సవాలు ప్రారంభం
ABN, First Publish Date - 2022-05-30T05:20:01+05:30
తీర ప్రాంత ప్రజల ఆరాధ్యదేవత ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
మొగల్తూరు, మే 29: తీర ప్రాంత ప్రజల ఆరాధ్యదేవత ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎమ్మెల్యే ముదు నూరి ప్రసాదరాజు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆలయం వద్ద ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. వచ్చే నెల 12 వరకు వివిధ పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 13న అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సరిహద్దు జిల్లాలైన కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల కారణంగా అమ్మవారి ఆలయం వద్ద మొక్కుబడులు నిషేధించడంతో పూజలు చేశారు. ఆలయం వద్ద భక్తులకు సౌకర్యాలను చైర్మన్ కొల్లాటి రామారావు, ఈవో డి.రామకృష్ణం రాజు పర్యవేక్షించారు.
ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం 3 గంటలకు చింతరేవు కోదండరామ భజన సమాజం ఆద్వర్యంలో భజన కాలక్షేపం, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కు చెందిన రవీంద్రనాథ్ మ్యాజిక్ షో, మిమిక్రీ, రాత్రి 9 గంటలకు ఆకాశ్ ఆర్కెస్ట్రా వారి సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-05-30T05:20:01+05:30 IST