అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN, First Publish Date - 2022-01-22T19:08:57+05:30
అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం: అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డి గూడెంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అరటి గెలల కొనుగోళ్లను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అరటి గెలలపై రైతులకు వస్తున్న ధరలను అడిగి తెలుసుకున్నారు. అరటి గెలలకు ధరలు రాక నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అరటి గెలలకు గిట్టుబాటు ధర లేక అరటి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్పూరం అరటి గెలకు రూ.100 లోపే ధర రావడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక అరటి రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అరటి గెలకు రూ.250 పైగా ధర వస్తే గానీ రైతులకు గిట్టుబాటు ధర రాదన్నారు. అరటి గెలలకు కనీస ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, నాయకులు బి. రామచంద్ర రావు,ఎ. వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-22T19:08:57+05:30 IST