వర్షం పడితే ఇంతే..
ABN, First Publish Date - 2022-08-10T05:11:55+05:30
చినుకు పడితే చాలు.. జిల్లాలో అనేక రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేకపోతున్నారు.
చెరువులను తలపిస్తున్న రహదారులు
రాకపోకలకు తప్పని ఇబ్బందులు
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/కురుపాం, ఆగస్టు 9 : చినుకు పడితే చాలు.. జిల్లాలో అనేక రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పార్వతీపురం-పాలకొండ రహదారి, తోటపల్లి కుడి కాలువ సమీపంలో ఉన్న ప్రధాన రోడ్డు, పార్వతీపురం మండలం ఎల్ఎన్ పురం రహదారి మరింత అధ్వానంగా మారాయి. ఆయా రోడ్లపై ఏర్పడిన గోతుల్లో వర్షపునీరు చేరింది. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక పలువురు జాగ్రత్తగా వాహనాలను నడపాల్సి వస్తోంది. ఇంకొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంపై ఆయా ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. ప్రధాన రహదారులే ఇలా ఉంటే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కురుపాంలో టీడీపీ నేతలు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కురుపాం నుంచి పార్వతీపురం వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతల్లో వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చాలని వారు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-08-10T05:11:55+05:30 IST