ఆరిలోవ అటవీ ప్రాంతం రోడ్డు విస్తరణలో ఎమ్మెల్యే విఫలం
ABN, First Publish Date - 2022-10-04T05:24:34+05:30
ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్లు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర అన్నారు.
జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వీరసూర్యచంద్ర
గొలుగొండ, అక్టోబరు 3: ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్లు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర అన్నారు. ఆరిలోవ అటవీ ప్రాంతంలో జనసేన నాయకులు సోమవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వీరసూర్యచంద్ర మాట్లాడుతూ.. మండలంలో ఎర్రవరం నుంచి పప్పశెట్టిపాలెం మధ్యలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్లు రోడ్డు గతుకులమయంగా మారిందని, ఇరుకుగా ఉండడంతో పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ అధికారం చేపట్టిన ఏడాదిలోపే రోడ్డు మరమ్మతులు, విస్తరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు గడుస్తున్నప్పటికీ రోడ్డు విస్తరణ, మరమ్మతులు చేపట్టేందుకు ఎమ్మెల్యే కృషి చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ రోడ్డులో అడుక్కో గొయ్యి ఏర్పడడంతో వర్షపు నీరు గతుకుల్లో చేరి రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆటవీ శాఖకు రూ.46 లక్షలు చెల్లించలేని చేతకాని ఎమ్మెల్యేగా ప్రజల్లో నిలిచిపోయారన్నారు. రోడ్డు ఏర్పాటుకు ఆరు కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడంలో విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేగుబళ్ల శివ, గండెం దొబాబు, అద్దేపల్లి గణేష్, మల్లాటి శ్రీను, తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-04T05:24:34+05:30 IST