పంటల బీమా కొందరికేనా?
ABN, First Publish Date - 2022-06-16T04:28:00+05:30
పంటల బీమా మంజూరులో జిల్లాలో అత్యధిక శాతం రైతులకు అన్యాయం జరిగింది. ప్రధానంగా జిల్లాలో జీడి, వరి, అరటి సాగుదారులకు సర్కారు మొండి చేయి చూపింది.
జీడి, వరి రైతులకు మొండిచేయి
గిరిజనులకు తీవ్ర అన్యాయం
అర్హులందరికీ అందని వైనం
క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేయకుండానే పరిహారాల చెల్లింపు
కన్నెర్రజేస్తున్న అన్నదాతలు
( పార్వతీపురం - ఆంధ్రజ్యోతి / జియ్యమ్మవలస )
పంటల బీమా మంజూరులో జిల్లాలో అత్యధిక శాతం రైతులకు అన్యాయం జరిగింది. ప్రధానంగా జిల్లాలో జీడి, వరి, అరటి సాగుదారులకు సర్కారు మొండి చేయి చూపింది. కొందరికే పథకం పరిమితం చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేయకుండానే పరిహారాలు చెల్లించడంపై అన్నదాతలు కన్నెర్రజేస్తున్నారు. అర్హులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో పంటలను నష్టపోయిన రైతులు వందల్లో ఉన్నారు. అయితే సర్కారు కొద్ది మందికే పరిహారం అందజేసింది. ఇంకొందరికి పూర్తిగా మంజూరు చేయలేదు. అయితే ప్రతి పంచాయతీలోనూ పదుల సంఖ్యలో అర్హులైన అన్నదాతలు ఉన్నా.. వారికి బీమా సొమ్ము అందలేదు. ప్రధానంగా ఈ ఏడాది తెగుళ్ల కారణంగా జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు 50 వేల ఎకరాలకు పైబడి జీడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినా గిరిజన రైతులకు పరిహారం అందించలేదు. తమకు బీమా వర్తింపజేయాలని గతంలో జీడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశాంత్కుమార్ రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో జీడి తోటలను రాష్ట్రస్థాయి అధి కార బృందం పరిశీలించింది. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పి వెళ్లారు. దీంతో తమకు నష్ట పరిహారం అందుతుందని ఆశ పడిన గిరిజన రైతులకు చివరకు నిరాశే మిగిలింది. దీనిపై గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు పెదవివిరుస్తున్నారు.
వరి నష్టపోయిన రైతుల పరిస్థితి ఇలానే ఉంది. గత ఖరీఫ్లో భారీ వర్షాల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే కేవలం రూ. 11 లక్షలు మాత్రమే బీమా పరిహారం కింద రైతులకు అందించారు. పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో సుమారు 15 వేల ఎకరాలకు పైబడి నష్టం ఏర్పడిందని అప్పట్లో కొంతమంది చెప్పారు. అయితే అధికారికంగా నష్టాన్ని నమోదు చేయకపోవడంతో వరి నష్టపోయిన అత్యధిక రైతులకు బీమా మంజూరు కాలేదని కొందరు వాపోతున్నారు. కురుపాం మండలంలో గతేడాది 7,932 ఎకరాల్లో 3,772 మంది రైతులు వరి సాగు చేపట్టారు. అయితే వరికోత పంట యంత్రం పద్ధతి ప్రకారం నష్టం అంచనా వేసి కేవలం పల్లంలేవిడి సచివాలయం పరిధిలో 66 మందికి రూ.రెండు లక్షల 20వేలు మాత్రమే మంజూరు చేశారు.
జిల్లాలో అరటి పంట నష్టపోయిన రైతులకు కూడా పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించలేదు. తమకు న్యాయం చేయాలని జియ్యమ్మవలస మండలం గౌరీపురం గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు బుధవారం డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా మంది అరటి రైతులకు పంటల బీమా పథకం కింద పరిహారం అందలేదు. కారణాలేమిటో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది.
మంజూరు ఇలా..
జిల్లాలో 5,989 మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రూ. 15.99 కోట్లు విడుదలైంది. ఇందులో పాలకొండ మండలంలో 160 మందికి రూ. 11 లక్షలు, వీరఘట్టంలో 470 మందికి రూ. 1.19 కోట్లు, సీతంపేటలో 9 మందికి రూ. 74 వేలు, భామిని మండలంలో ఒకే ఒక్క రైతుకు రూ.18 వేలు మంజూరు చేశారు. జియ్యమ్మవలసలో 2,219 మందికి రూ. 4.98 కోట్లు , కురుపాంలో 448 మందికి రూ. 1.53 కోట్లు, గుమ్మలక్ష్మీపురంలో ఏడుగురికి రూ. 54 వేలు చొప్పున బీమా క్లైయిమ్లు వచ్చాయి. పార్వతీపురం డివిజన్లోని సాలూరు మండలంలో 921 మందికి రూ. 3.47 కోట్లు, మక్కువలో 490 మందికి రూ. 1.55 కోట్లు, పాచిపెంటలో 162 మందికి రూ. 55.18 లక్షలు, బలిజిపేటలో 144 మందికి రూ. 17.30 లక్షలు, సీతానగరంలో 30 మందికి రూ. 4.59 లక్షలు, కొమరాడలో 483 మందికి రూ. 1.53 కోట్లు, గరుగుబిల్లిలో 575 మందికి రూ. 1.25 కోట్లు మంజూరయ్యాయి.
కారణాలెన్నో..
ఈ-క్రాప్, ఎంత పంట నష్టం జరిగింది అనేది రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారులు తేల్చాలి. కానీ కొన్ని చోట్ల ఈ పని వలంటీర్లేకే అప్పజెప్పడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది.
చాలా చోట్ల క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు. ఒక చోట కూర్చొని ఈ-క్రాప్ నమోదు చేయడం వల్ల పరిహారం అందలేదని రైతులు చెబుతున్నారు.
అథంటికేషన్ (బయోమెట్రిక్) వేసినా చాలా మంది రైతులకు పంటల బీమా వర్తించలేదు. ఇంకా వీరికి బయోమెట్రిక్ జరగలేదని చూపుతోంది.
అన్ని సక్రమంగా ఉన్నా కొందరికి క్లయిమ్ సొమ్ము రాలేదు.
అరటి రైతులకు ఎంత నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో అధికారులెవ్వరూ పరిశీలించలేదు. ఎలా నష్టం లెక్కించారో? ఎక్కడ లెక్కగట్టారో రైతులకే తెలియదు.
మాకు తెలియదు
పంటల బీమా పథకానికి సంబంధించి ఈ-క్రాప్ అంతా చేశాం. కానీ నష్ట పరిహారం మంజూరులో ఏమైందో మాకు తెలియదు. ప్రభుత్వం మరో అవకాశం ఇస్తుందని భావిస్తున్నా.
- కె.కిరణ్మయి, ఉద్యాన అధికారి, కురుపాం
Updated Date - 2022-06-16T04:28:00+05:30 IST