దారి దోపిడీ కేసులో ఐదుగురికి జైలు
ABN, First Publish Date - 2022-08-05T05:29:27+05:30
దారి దోపిడీకి పాల్పడిన ఐదుగురు ఒడిశా వాసులకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు సబ్జడ్జి టి.వాసుదేవన్ గురువారం తీర్పు చెప్పారు.
ఐదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు
నిందితులందరూ ఒడిశా వాసులు
బొబ్బిలి, ఆగస్టు 4: దారి దోపిడీకి పాల్పడిన ఐదుగురు ఒడిశా వాసులకు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు సబ్జడ్జి టి.వాసుదేవన్ గురువారం తీర్పు చెప్పారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మజ్జి జగన్నాథం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015 నవంబరు 28న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన కొండపల్లి గోపి సాలూరు మండలం ఎం.చింతలవలస సంతకు వెళ్తుండగా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన తాడంగి జయ ప్రకాశ్, పక్కి సురేష్, కొట్టక్కి రాజు, కొట్టక్కి భీమ, కొట్టక్కి దిలీప్లు దారికాసి గోపిని అటకాయించారు. అతని వద్ద నుంచి రూ.70 వేలు కాజేశారు. అప్పట్లో ఈ కేసును సాలూరు రూరల్ పోలీసులు నమోదు చేశారు. దీనిపై విచారించిన బొబ్బిలి కోర్టు సబ్జడ్జి టి.వాసుదేవన్ గురువారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బాధితుని అడ్డగించినందుకు అదనంగా మరో నెల శిక్ష కూడా ఉంటుందని తీర్పు చెప్పినట్లు అడిషనల్ పీపీ మజ్జి తెలిపారు.
------------
Updated Date - 2022-08-05T05:29:27+05:30 IST