విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయం
ABN, First Publish Date - 2022-06-29T06:13:42+05:30
విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీనిని ఆపలేరని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
గోపాలపట్నం, జూన్ 28: విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీనిని ఆపలేరని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కుమారి కల్యాణ మండపంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 30న గురజాడ కళాక్షేత్రంలో జరగనున్న వైసీపీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ మాట్లాడుతూ చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ అని విమర్శించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జి ఆడారి ఆనంద్కుమార్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యకమంలో తాను పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఎన్ఏడీ కూడలిలో కార్యాలయాలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో వుంటానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కో-ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బీఎస్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ముత్తంశెట్టి కునుకుపాట్లు!
కాగా ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో వేదికపై కూర్చున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు కునుకుపాట్లు పడుతూ కనిపించారు. దీనిని చూసిన పలువురు కార్యకర్తలు కాస్త నవ్వుకో వడమే కాకుండా ఈ అంశంపై చర్చించుకున్నారు.
Updated Date - 2022-06-29T06:13:42+05:30 IST