విద్యుత్ భారం రూ.187.85 కోట్లు
ABN, First Publish Date - 2022-08-13T07:02:27+05:30
ట్రూ అప్ చార్జీల పేరుతో విశాఖపట్నం సర్కిల్లోని వినియోగదారులపై ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.187.85 కోట్ల భారం మోపుతోంది.
ట్రూ అప్ చార్జీల పేరిట వసూలు
విశాఖ సర్కిల్లో హెచ్టీ వినియోగదారుల నుంచి నెలకు రూ.6.84 కోట్లు చొప్పున రూ.123.2 కోట్లు, ఎల్టీ వినియోగదారుల నుంచి నెలకు రూ.3.59 కోట్లు చొప్పున రూ.64.65 కోట్లు ఏడాదిన్నర వసూలు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
ట్రూ అప్ చార్జీల పేరుతో విశాఖపట్నం సర్కిల్లోని వినియోగదారులపై ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.187.85 కోట్ల భారం మోపుతోంది. దీనిని నెలకు రూ.10.44 కోట్లు చొప్పున 18 నెలలు వసూలు చేయనుంది. 2014-2019 మధ్యకాలంలో వినియోగదారుల కోసం కొనుగోలు చేసిన విద్యుత్, సరఫరా వ్యయాల మధ్య భారీగా వ్యత్యాసం వుండడంతో దానిని ‘ట్రూ అప్’ చార్జీలతో పూడ్చుకోవడానికి నిర్ణయించింది. ఇందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. ఆ ఐదేళ్ల కాలంలో వినియోగదారులు వాడుకున్న విద్యుత్పై యూనిట్కు ఏడు పైసలు చొప్పున ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులు ఐదేళ్ల రికార్డులు తీసి, హెచ్టీ వినియోగదారులు..అందులో వివిధ విభాగాలు, ఎల్టీ వినియోగదారులు...వివిధ విభాగాలు అన్నింటిని లెక్కలు వేసి మొత్తం ఎన్ని యూనిట్లు వినియోగించారనేది తేల్చారు.
- ఆ ఐదేళ్లలో హెచ్టీ వినియోగదారులంతా కలిసి 17599.845 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. వీరి నుంచి రూ.123.2 కోట్లు రాబట్టుకోవలసి ఉండగా నెలకు రూ.6.84 కోట్లు చొప్పున 18 నెలలు వసూలు చేయనున్నారు.
- ఎల్టీ వినియోగదారులు 9,236.26 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆ ఐదేళ్లలో వినియోగించుకున్నారు. వారి నుంచి ట్రూ అప్ చార్జీలుగా రూ.64.65 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీనిని నెలకు రూ.3.59 కోట్లు చొప్పున 18 నెలలు వసూలు చేస్తారు.
బిల్లులోనే సర్దుబాటు
ఎల్.మహేంద్రనాథ్, ఎస్ఈ, విశాఖపట్నం
ట్రూ అప్ చార్జీలు ప్రతి నెల బిల్లులో ప్రత్యేకంగా చూపిస్తారు. వినియోగాన్ని బట్టే అవి ఉంటాయి. యూనిట్కు ఏడు పైసలు వసూలు చేస్తున్నాము. ఆగస్టు నెల బిల్లులో ఇప్పటికే సర్దుబాటు చేశాము. ఇంకో 17 నెలలు చెల్లిస్తే సరిపోతుంది.
Updated Date - 2022-08-13T07:02:27+05:30 IST