చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి
ABN, First Publish Date - 2022-04-06T05:59:27+05:30
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.
తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
పాడేరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన మంగళవారం ఇక్కడ నిర్వహించిన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లడంతోపాటు, టీడీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించాలన్నారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమనే అంశాలను ప్రజల్లో తీసుకు వెళ్లాలన్నారు. అలాగే మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలుంటే పరిష్కరించుకుని, ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని, అందర్నీ కష్టాలపాల్జేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై టీడీపీ విజయానికి పాటుపడాలన్నారు. పాడేరు నియోజకవర్గ పరిశీలకుడుగా నియమితులైన లొడగల కృష్ణారావుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీఎస్.ప్రసాద్, నాయకులు వంజంగి కాంతమ్మ, కొట్టగుళ్లి సుబ్బారావు తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-04-06T05:59:27+05:30 IST