జాతీయ స్థాయిలో ఏయూ విద్యార్థుల ప్రతిభ
ABN, First Publish Date - 2022-01-21T04:54:34+05:30
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు.
ఏయూ క్యాంపస్, జనవరి 20: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) పలు దఫాలుగా నిర్వహించిన చునైతి 2.0 ప్రోగ్రాంలో ఏయూ విద్యార్థులు కాపుగంటి వికాస్, పొన్నాడ మహీధర్లు ప్రతిభ కనపర్చారు. వీరు నిర్వహిస్తున్న ఎడ్టెక్ స్టార్టప్ ఎడ్యుమూన్ జాతీయ స్థాయిలో ఎంపికైంది. మూడు రౌండ్ల్లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో వీరు ఈ స్థానం సాధించారు. వీరు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే పలు కార్యక్రమాలను రూపొందించి ప్రాజెక్టుగా తయారుచేసి ఎస్టీపీఐకు సమర్పించారు. వారు దీనిపై పరిశీలన జరిపి ఉత్తమంగా ఈ స్టార్టప్లను ఎంపిక చేశారు. వీరికి త్వరలో ఫండింగ్ కూడా లభించనుంది. దేశవ్యాప్తంగా వెయ్యి మంది వివిధ ప్రాజెక్టులతో పోటీపడగా 40 మంది మాత్రమే ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు ఏయూ విద్యార్థులు ఉన్నారు. ఉత్తమంగా నిలిచిన కాపుగంటి వికాస్, పొన్నాడ మహీధర్లను గురువారం వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-21T04:54:34+05:30 IST