రోలుగుంట ఎంఈఓ సస్పెన్షన్
ABN, First Publish Date - 2022-11-19T00:38:07+05:30
నిధుల దుర్వినియోగంపై రోలుగుంట ఎంఈవో కిరణ్మయిని సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ ఆర్జేడీ జ్యోతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యా శాఖ ఆర్జేడీ జ్యోతికుమారి ఉత్తర్వులు జారీ
నిధుల దుర్వినియోగం నిర్ధారణ కావడంతో వేటు
రోలుగుంట, నవంబరు 18: నిధుల దుర్వినియోగంపై రోలుగుంట ఎంఈవో కిరణ్మయిని సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ ఆర్జేడీ జ్యోతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈవో కార్యాలయానికి గత నాలుగేళ్లలో (2018-2022) విడుదలైన నిధులపై రోలుగుంటకు చెందిన మడ్డు శివ రామకుమార్ సమాచార హక్కు చట్టం కింద వివరాలను సేకరించారు. కార్యాలయంలో పనిచేస్తున్న మెసేంజర్ మడ్డు రామచంద్రరావు పేరు మీద లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్టు బిల్లులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించినట్టు గుర్తించిన ఆయన ఈ ఏడాది ఆగస్టు 28న స్పందనలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డీఈఓ లక్ష్మణరావు విచారణ జరిపారు. కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్, డీఈఓ, ఆర్జేడీలకు అందించారు. నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారణ కావడంతో ఎంఈవో కిరణ్మయిని సస్పెండ్ చేశారు.
స.హ.చట్టం ద్వారా బహిర్గతం
మండల విద్యా శాఖ కార్యాలయంలో 2018-19 నుంచి 2021-22 వరకు నిధుల వినియోగం వివరాలు కావాలని రోలుగుంట గ్రామానికి చెందిన మడ్డు శివరామ్కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. సమాచారం ఇవ్వడానికి రూ.6,000 డీడీ తీయాలని ఎంఈవో కిరణ్మయి వర్తమానం పంపారు. అంత మొత్తం ఎందుకని దరఖాస్తుదారుడు ప్రశ్నించారు. దీంతో ఆమె వివరాలను ఆందజేశారు. 2018-19లో రూ.80 వేలు, 2019-20లో రూ.2,47,395, 2020-21లో రూ.1,59,852, 2021-22లో రూ.75 వేలు ఖర్చు చేసినట్టు బిల్లులతో సహా సమాచారం ఇచ్చారు. అయితే ఎంఈవో కార్యాలయంలో మేసేంజర్గా పనిచేస్తున్న మడ్డు రామచంద్రరావు పేరుమీద రూ.1,05,993 చెల్లించినట్టు బిల్లులు ఉన్నాయి. ఆర్సీ నంబరు, జీఎస్టీ లేని శ్రీసిద్ధివినాయక బుక్స్ అండ్ జనరల్ స్టోర్స్ పేరుమీద ఈ చెల్లింపులు జరిగాయి. ఆ బుక్ స్టోర్లో విక్రయించని ప్రింటర్ రిఫిల్లింగ్, ప్రింటర్ డ్రమ్, మంచినీరు సరఫరాతోపాటు వైట్వాష్, పెయింటింగ్, లేబర్ ఛార్జీలు చెల్లించినట్టు బిల్లులు సృష్టించారు. కొవిడ్-19 ప్రబలినప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ విధించి అన్ని కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఈ సమయంలో ఇదే బుక్స్టోర్స్ నుంచి రోజూ వాటర్ క్యాన్లు సరఫరా అయినట్టు రూ.4,200 బిల్లులు వున్నాయి. ఎంఈవో కార్యాలయం భవనం మరుగుదొడ్డుకి దారి నిమిత్తం పనులు చేయించినట్టు రూ.8 వేలకు బిల్లులు పెట్టి నిధులు డ్రా చేశారు. హెచ్ఎంల సమావేశం సందర్భంగా టీ, స్నాక్స్ కోసం రూ.16,600 ఖర్చు చేసినట్టు బిల్లులు ఉన్నాయి. కానీ ఒక్క సమావేశంలో కూడా టీ, స్నాక్స్ ఇవ్వలేదని పాఠశాలల హెచ్ఎంలు చెబుతున్నారు. 2018-19లో సెల్ఫోన్ల రీచార్జిల నిమిత్తం రూ.12,700 ఖర్చు చేసినట్టు బిల్లులు ఉన్నాయి.
Updated Date - 2022-11-19T00:38:08+05:30 IST