వ్యూహకర్త ప్రసాదే!
ABN, First Publish Date - 2022-07-04T06:08:47+05:30
నగరంలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారం తాకట్టు పెడతానని గోల్డ్లోన్ కంపెనీ ఏజెంట్ను తన దుకాణానికి పిలిపించిన భీశెట్టి ప్రసాదే వ్యూహకర్తగా దర్యాప్తులో తేలింది.
దోపిడీ కేసుని ఛేదించిన పోలీసులు
నిందితుడు దక్షిణ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి అనుచరుడు
ముందస్తు పఽథకం ప్రకారం రాజునాయుడుని రప్పించిన ప్రసాద్
బంగారం చూపించి నగదు తీసుకున్న వైనం
స్నేహితులకు సమాచారం ఇచ్చి, దోపిడీ నాటకం
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నగరంలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారం తాకట్టు పెడతానని గోల్డ్లోన్ కంపెనీ ఏజెంట్ను తన దుకాణానికి పిలిపించిన భీశెట్టి ప్రసాదే వ్యూహకర్తగా దర్యాప్తులో తేలింది. దీంతో ప్రసాద్తోపాటు అతడికి సహరికరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఒకటిరెండు రోజుల్లో మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
షీలానగర్కు చెందిన భీశెట్టి ప్రసాద్ దొండపర్తి యమహాషోరూమ్ వెనుక బీడబ్ల్యూ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్లోర్మ్యాటీల దుకాణం నిర్వహిస్తున్నాడు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి అనుచరుడినని చెబుతుంటాడు. దీంతో చాలామందితో ప్రసాద్కు పరిచయాలు ఏర్పడ్డాయి. తనకు అప్పులు పెరగడంతో, సులభంగా డబ్బు సంపాదించాలని యోచించాడు. ఈక్రమంలో అజ్మార్ట్ డోర్స్టెప్ గోల్డ్లోన్ కంపెనీలో పనిచేస్తున్న పరిచయస్థుడు రాజునాయుడుపై దృష్టిపడింది. ఎవరి నుంచైనా బంగారం తెచ్చి, వాటిని రాజునాయుడికి చూపించి, తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలని అడిగి, డబ్బు తెచ్చిన తర్వాత దోపిడీ నాటకం ఆడించి కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆక్రమంలోనే తకు తెలిసిన ఒక మహిళ నుంచి బంగారం తెచ్చి, కారులో పెట్టుకుని గతనెల 28న రాజునాయుడుకి ఫోన్చేసి రప్పించాడు. తన వద్ద ఉన్న 800 గ్రాముల బంగారాన్ని అతడికి చూపించి, డబ్బు కావాలని అడిగాడు. తన యజమానిని అడిగి తెస్తానని రాజునాయుడు కారుదిగిపోయాడు. మరుసటి రోజు అతడు రూ.17 లక్షలు పట్టుకుని దొండపర్తిలోని ప్రసాద్ షాప్ వద్దకు వెళ్లాడు. బంగారం చూపించగా, రాజునాయుడు నగదుని ప్రసాద్కు అందజేశాడు. వెంటనే వెనుక గదిలో ఉన్న ప్రసాద్ స్నేహితులు రిషి, నజీర్తోపాటు మరో వ్యక్తి వారిపై దాడిచేసి రాజునాయుడు, ప్రసాద్ను వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లారు. రాజునాయుడుని తాళ్లతో బంధించి, బంగారం, నగదు పట్టుకుని ప్రసాద్, అతని స్నేహితులు పరారయ్యారు. అనంతరం తాళ్లు విప్పుకుని బయటపడిన రాజునాయుడు నేరుగా తన యజమాని వద్దకు వెళ్లి దోపిడీ గురించి చెప్పకుండా, మరో రూ.18 లక్షలు కావాలని చెప్పి ఆ డబ్బును తన ఇంటికి తీసుకుపోయాడు. తర్వాత దోపిడీ జరిగిందని యజమానికి చెబితే పోలీసు కేసు పెట్టకుండా సొంతంగా విచారణ చేస్తాడని భావించాడు. కానీ రాజునాయుడు చెప్పగానే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించడంతో కంగుతిన్నాడు. పోలీసులు రాజునాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వాస్తవాన్ని వివరించాడు. తర్వాత మరింతలోతుగా దర్యాప్తు చేసి, ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల వివరాలు లభ్యమవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఒకటి, రెండురోజుల్లో పూర్తివివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Updated Date - 2022-07-04T06:08:47+05:30 IST