నాడు నేడు పనుల్లో నాణ్యత ముఖ్యం
ABN, First Publish Date - 2022-10-08T06:02:26+05:30
నాడు-నేడు పనుల్లో నాణ్యత ముఖ్యమని రాష్ట్ర పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కారద ర్శి బి.రాజశేఖర్ సూచించారు. ఏవీఎన్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన నాడు-నేడు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కారద ర్శి బి.రాజశేఖర్
విశాఖపట్నం, అక్టోబరు 7: నాడు-నేడు పనుల్లో నాణ్యత ముఖ్యమని రాష్ట్ర పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్య కారద ర్శి బి.రాజశేఖర్ సూచించారు. ఏవీఎన్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన నాడు-నేడు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో 19, అల్లూరి సీతరామరాజు జిల్లాలో 9, విశాఖలో 8 ప్రభుత్వజూనియర్ కళాశాలల్లో నాడు-నేడు పథకంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా పనులు చేపట్టేటప్పుడు కళాశాల ప్రిన్సిపాళ్లు, అభివృద్ధి కమిటీలు ఎక్కడా రాజీపడకూడదన్నారు.
తమ సొంత ఇంటి నిర్మాణాలు ఏ విధంగా చేపడతారో, కళాశాలల్లో జరుగుతున్న నిర్మాణాలను అదే విధంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణంతోపాటు ఫర్నీచర్ సమకూర్చాలన్నారు. నిర్మాణ సామాగ్రి కొనుగోలులో ఎలాంటి వెనకడుగు వేయకుండా నాణ్యమైన బ్రాండ్ కొనుగోలు చేయాలని సూచించారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రూ.కోట్ల ఖర్చుతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలుండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.
ఏ కళాశాలలోనైనా శిథిల భవనాలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన అనుమతితో కూల్చివేయాలని, ఆ ప్రదేశంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పవర్ ప్రెజెంటేషన్ ద్వారా నాడు-నేడు పనుల చేపట్టే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ శేషగిరిబాబు, ప్రభుత్వ సలహదారు మురళీ, సంయుక్త కార్యదర్శి సుశీల, ఆర్.జె.డి.శారద, ఆర్ఐవో మద్దిలి వినోద్బాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాడు నేడు ఏఈలు, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T06:02:26+05:30 IST