మనస్తాపంతో ప్రైవేటు పాఠశాల టీచర్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-18T04:38:33+05:30
ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకోవాలని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
లంకెలపాలెం, జనవరి 17: ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకోవాలని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చింతల రాజేశ్వరి(30) భర్త అప్పారావు, ఇద్దరి పిల్లలతో కలిసి కన్నూరు గ్రామంలో నివాసముంటున్నారు. భర్త కశింకోటలోని ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, రాజేశ్వరి మునగపాక మండలం తోటాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉండి పిల్లలను చూసుకోవాలని ఇటీవల భర్త చెప్పడంతో అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోరోజూ మాదిరిగానే భర్త సోమవారం విధులకు వెళ్లారు. పెద్ద కుమారుడు(6) ఆమె ఆడపడుచు ఇంటికి వెళ్లగా, చిన్న కుమారుడు(2) ఇంట్లోనే ఉన్నాడు. కాగా మనస్తాపంతో ఉన్న ఆమె ఫ్యాన్ హుక్కుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బందితో ఎస్ఐ సురేశ్ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-01-18T04:38:33+05:30 IST