పట్టపగలు దారిదోపిడీ
ABN, First Publish Date - 2022-03-05T06:11:30+05:30
స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో పట్టపగలు దారిదోపిడీ జరిగింది.
పెదబొడ్డేపల్లిలో ‘ఏజెన్సీ వ్యాపారి’ని గాయపరిచిన దుండగులు
రూ.2 లక్షల నగదు, ఉంగరం, సెల్ఫోన్తో ఉడాయింపు
నర్సీపట్నం, మార్చి 4: స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో పట్టపగలు దారిదోపిడీ జరిగింది. రావికమతం మండలానికి చెందిన ‘ఏజెన్సీ వ్యాపారి’ని దుండగులు తీవ్రంగా కొట్టి, రూ.2 లక్షల నగదు, ముప్పావు తులం బంగారు ఉంగరం, సెల్ఫోన్ను అపహరించుకు పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నర్సీపట్నం రూరల్ ఎస్ఐ ఎస్.రమేశ్ తెలిపిన వివరాలు... రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన సింగిడి రాజారావు (63) ఏజెన్సీలో గిరిజనుల నుంచి వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో నర్సీపట్నం రావడానికి దొండపూడి వద్ద రోడ్డు పక్కన నిలబడి వాహనం కోసం ఎదురుచూస్తుండగా...ఒక ఒక ఆటో రావడంతో అందులో ఎక్కారు. అప్పటికే డ్రైవర్ కాకుండా మరో నలుగురు యువకులు ఆటోలో ఉన్నారు. డ్రైవర్ కొత్తకోట పెట్రోల్ బంక్ వద్ద ఆటో ఆపాడు. ‘డీజిల్ కొట్టించడానికి రూ.100 ఇవ్వండి, చార్జీ పోను మిగిలిన డబ్బులు నర్సీపట్నంలో ఇచ్చేస్తాను’ అని రాజారావును అడిగాడు. ఆయన డబ్బులు ఇచ్చిన తరువాత డీజిల్ కొట్టించుకుని నర్సీపట్నం బయలుదేరారు. లక్ష్మీపురం దాటిన తర్వాత ఆటోను ఎడమవైపు మళ్లించి పెదబొడ్డేపల్లి సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక వున్న సరుగుడు తోటలోకి తీసుకువెళ్లాడు. అక్కడ డ్రైవర్తోపాటు మిగిలిన నలుగురు వ్యక్తులు కలిసి రాజారావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన వద్ద సంచిలో వున్న రూ.2 లక్షలు నగదు, ముప్పావు తులం బంగారు ఉంగరం, సెల్ఫోన్తోపాటు జేబులో వున్న చిల్లర డబ్బులు కూడా లాగేసుకున్నారు. అనంతరం ఆటోలో పరారయ్యారు. రాజారావు మెయిన్ రోడ్డుకు నడుచుకుంటూ వచ్చి, అక్కడ టీకొట్టు వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో వాకింగ్కు వచ్చిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెలగా జగన్నాథరావు గాయాలతో వున్న రాజారావుని చూశారు. జరిగిన సంఘటన గురించి తెలుసుకుని దొండపూడి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధ్యాహ్నం తిరిగి రాజారావు నర్సీపట్నం చేరుకుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-03-05T06:11:30+05:30 IST