నల్ల బెల్లం విక్రయిస్తే చర్యలు
ABN, First Publish Date - 2022-05-15T06:21:46+05:30
నాటు సారా తయారీదారులకు ఎక్సైజ్ శాఖ నిబంధలకు విరుద్ధంగా నల్ల బెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బెల్లం వ్యాపారులు అనకాపల్లిని సారా రహిత జిల్లాగా మార్చేందుకు తమవంతు సహకారం అందించాలని విశాఖపట్నం రేంజి డీఐజీ బి.హరికృష్ణ కోరారు.
- అనకాపల్లిని సారా రహిత జిల్లాగా మార్చేందుకు బెల్లం వ్యాపారులు సహకరించాలి
- డీఐజీ హరికృష్ణ
అనకాపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): నాటు సారా తయారీదారులకు ఎక్సైజ్ శాఖ నిబంధలకు విరుద్ధంగా నల్ల బెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బెల్లం వ్యాపారులు అనకాపల్లిని సారా రహిత జిల్లాగా మార్చేందుకు తమవంతు సహకారం అందించాలని విశాఖపట్నం రేంజి డీఐజీ బి.హరికృష్ణ కోరారు. శనివారం ఆయన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గౌతమి శాలి ఆధ్వర్యంలో బెల్లం వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తయారీదారులకు నల్ల బెల్లం అధిక నిల్వలు విక్రయించరాదన్నారు. నాటుసారా తయారీకి ముడి సరకుగా వినియోగిస్తున్న నల్ల బెల్లం విక్రయాలపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. ఎవరైనా ఎక్కువ మొత్తంలో నల్ల బెల్లం కొనుగోలు చేస్తే వారికి వ్యాపారులు కూడా నాటుసారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఐజీ మాట్లాడుతూ నాటుసారా తయారీదారుల సమాచారాన్ని డయల్ 100కు ఫోన్ చేసి గానీ, లేదా వాట్సాప్ నంబరు 9505200100కు తెలియ జేయాలని కోరారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
పీడీ యాక్టును ప్రయోగిస్తాం
నాటుసారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. నాటుసారా తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టు రుజువైతే అటువంటి వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు. నాటుసారా కేసుల్లో వున్నవారితో లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 వేల మందిపై బైండోవర్ చేశామన్నారు. ఇక ముందు నాటుసారా తయారు చేసినా, అమ్మినా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. తరచూ నాటుసారా తయారీ, రవాణా కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్టు ప్రయోగించి సంవత్సర కాలం పాటు జైలుకు పంపుతామన్నారు. జిల్లాలో రావికమతం పోలీసు స్టేషన్ పరిధిలో 8 కేసులలో నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు తరలించామన్నారు. సమావేశానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ, ఏసీలు హాజరయ్యారు.
Updated Date - 2022-05-15T06:21:46+05:30 IST