‘పేట’ వాసులను వీడని వానరాల బెడద!
ABN, First Publish Date - 2022-01-21T06:20:18+05:30
వానరాల బెడద మండల వాసులను వీడడం లేదు. పలు గ్రామాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అలజడి సృష్టిస్తుండడంతో పాటు కొన్ని చోట్ల పంటలను సైతం పాడుచేస్తున్నాయి.
పైరు పంటలను పాడుచేస్తున్న మూక
పాయకరావుపేట రూరల్, జనవరి 20 : వానరాల బెడద మండల వాసులను వీడడం లేదు. పలు గ్రామాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అలజడి సృష్టిస్తుండడంతో పాటు కొన్ని చోట్ల పంటలను సైతం పాడుచేస్తున్నాయి. తాజాగా ఇందులో కొన్నింటి కన్ను పైరు (పెసర, మినప) పంటలపై పడింది. ముఖ్యంగా పెసర మొక్కలను లాగివేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మంగవరం, అరట్లకోట, గోపాలపట్నం, మాసాహెబ్పేట, సత్యవరం, శ్రీరాంపురం, గుంటపల్లి తదితర గ్రామాల్లో వీటి బెడద అధికంగా ఉంది. పొలాల నుంచి వీటిని తరిమేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి తరిమే క్రమంలో మనుషులపై దాడిచేస్తున్నాయని చెపుతున్నారు. అధికారులు స్పందించి వీటి బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Updated Date - 2022-01-21T06:20:18+05:30 IST