లేఅవుట్!
ABN, First Publish Date - 2022-06-28T06:36:21+05:30
రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు’ పథకం కోసం రూపొందించిన లేఅవుట్లు కోతకు గురవుతున్నాయి.
‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెంలో భారీ లేఅవుట్
విశాఖ ప్రాంతానికి చెందిన వేలాది మందికి స్థలాలు కేటాయింపు
ప్రస్తుతం కురుస్తున్న ఒక మోస్తరు వర్షానికే కోతకు గురవుతున్న లేఅవుట్
కొట్టుకుపోతున్న హద్దు రాళ్లు
చుట్టుపక్కల గల కొండల పైనుంచి వచ్చే నీరు పోయేందుకు మార్గం లేకపోవడమే కారణం
...గతంలో అక్కడ గల గెడ్డ కూడా పూడ్చివేత
సబ్బవరం, జూన్ 27:
రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు’ పథకం కోసం రూపొందించిన లేఅవుట్లు కోతకు గురవుతున్నాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారుల అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...
పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మండలంలోని పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెంతో పాటు మరో ఐదు గ్రామాల్లో సుమారు 1,200 ఎకరాల (కొన్ని బంజరు, మరికొన్ని డిపట్టా భూములు) వరకూ సమీకరించారు. పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో సమీకరించిన 320 ఎకరాల్లో ఏర్పాటుచేసిన లేఅవుట్లలో విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది వేల మంది లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. కొంతమంది వారి స్థలాలను ఇంకా చూసుకోలేదు. ఇదిలావుండగా ఆ తరువాత అడపాదడపా కురుస్తున్న వర్షాలకు లేఅవుట్ కోతకు గురవుతోంది. హద్దు రాళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి.
వీఎంఆర్డీఏ, రెవెన్యూ అధికారులు సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని లేఅవుట్కు భూములు ఇచ్చిన రైతులు (డిపట్టాదారులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 900 గజాలు ఇచ్చారు) ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గల కొండలు, వాగుల నుంచి వచ్చే వరద నీరు సమీపంలోని సాగునీటి చెరువుల్లోకి వెళ్లేందుకు ఎక్కడా మార్గం లేదని, దాంతో వరద నేరుగా లేఅవుట్లు పైనుంచి ప్రవహిస్తుందని చెబుతున్నారు. వరద నీరు లేఅవుట్ పైకి రాకుండా కనీసం ట్రెంచ్ అయినా ఏర్పాటు చేయలేదన్నారు. పైడివాడ అగ్రహారం సర్వే నంబర్ 128లో గెడ్డ ఉండేదని, లేఅవుట్ వేసే సమయంలో దానిని పూడ్చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే ప్రస్తుతం లేఅవుట్ మొత్తం కోతకు గురవుతోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులు కోరుతున్నారు.
Updated Date - 2022-06-28T06:36:21+05:30 IST