25న ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు జాబ్ మేళా
ABN, First Publish Date - 2022-05-23T05:15:06+05:30
కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో ఈనెల 25వ తేదీ బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన వారికి సినర్జీస్ కంపెనీలో ఆరు నెలల శిక్షణ
అనంతరం స్థానిక, ఓమన్లోని కంపెనీల్లో ఉద్యోగం
విశాఖపట్నం, మే 22: కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో ఈనెల 25వ తేదీ బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దువ్వాడ వద్ద ఉన్న సినర్జీస్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ట్రైనీ, ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిప్లొమాలో మెకానికల్, మెటలర్జీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్లో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐలో ఫిట్టర్, వెల్డర్, మెసినిస్ట్, డీజిల్ మెకానిక్, మోటారు మెకానిక్, టర్నర్, పెయింటర్ తదితర ట్రేడుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి తొలుత దువ్వాడ కంపెనీలో ఆరు నెలలు శిక్షణ అందజేస్తారని, అనంతరం శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారని తెలిపారు. శిక్షణ కాలంలో ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.14 వేలు, డిప్లొమా అభ్యర్థులకు రూ.15 వేలు వేతనం చెల్లిస్తారని తెలిపారు.
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన వారిలో ఆసక్తి చూపిన వారికి ఓమన్ (సౌదీ)లోని సినర్జీస్ క్యాస్టింగ్ కంపెనీలో ఉద్యోగావకాశం కల్పిస్తారని తెలిపారు. అక్కడకు వెళ్లే వారికి అన్ని వసతి సౌకర్యాలతోపాటు ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.25 వేలు, డిప్లొమా అభ్యర్థులకు రూ.27,500 చెల్లిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతగల యువత నేషనల్ కెరీర్ పోర్టల్లో తొలుత పేర్లు నమోదు చేసుకుని ఆ రోజు ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు నేరుగా హాజరు కావాలని సూచించారు.
Updated Date - 2022-05-23T05:15:06+05:30 IST