సర్కారు స్థలానికి ఎసరు!
ABN, First Publish Date - 2022-12-07T00:56:50+05:30
భూముల ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో నగర శివారు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అక్రమార్కులు తెగబడుతున్నారు. జిరాయితీ భూములను ఆనుకుని వున్న సర్కారు స్థలాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధాన రహదారుల పక్కనే ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.
పెందుర్తి, డిసెంబరు 6:
భూముల ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో నగర శివారు ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అక్రమార్కులు తెగబడుతున్నారు. జిరాయితీ భూములను ఆనుకుని వున్న సర్కారు స్థలాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధాన రహదారుల పక్కనే ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.
పెందుర్తి మండలం చినముషిడివాడ వెంకటాద్రి మార్గంలో సర్వే నంబర్ 113లోని ప్రభుత్వ భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. సమీప సర్వే నంబర్ 112లో జిరాయితీ స్థలం ఉండడంతో, ఆక్రమిత భూమికి ఆ సర్వే నంబరు వేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. దీని ఆధారంగా భారీ భవన నిర్మాణం చేపట్టారు. గతంలో ఈ స్థలాన్ని ఆక్రమించి పలువురు షెడ్లు నిర్మించడంపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అఽధికారులు స్పందించి, వాటిని తొలగించారు. అయినప్పటికీ తప్పుడు డాక్యుమెంట్లతో ఈసారి పక్కాగా ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసేందుకు అక్రమార్కులు ప్రణాళికలు వేశారు.
భారీగా ఆక్రమణలు
చినముషిడివాడ సర్వే నంబర్ 113లో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దశాబ్దకాలంగా కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించారు. అనంతరం వాటిని విక్రయించేశారు. ఇలా చేతులు మారిన స్థలాల్లో ఆక్రమణదారులు భారీ నిర్మాణాలు చేపట్టారు. దీనికి ఆనుకుని వున్న సర్వే నంబరు 112లో కొంత జిరాయితీ భూమి ఉంది. ఇదే అక్రమార్కులకు కలిసివచ్చింది. దీనిని ఆసరాగా చేసుకుని, సర్వే నంబరు 113లోని ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. ఆక్రమిత భూమికి జిరాయితీ సర్వే నంబరు 112గా చూపించి, డాక్యుమెంట్లు సృష్టించేశారు. గతంలో ఇదే స్థలంలోని 26 సెంట్లను ఆక్రమించి, ఓ బిల్డర్ అపార్టుమెంట్ నిర్మించిన వైనంపై ఫిర్యాదులందగా, విచారణ చేపట్టిన రెవెన్యూ సిబ్బందిలో కొందరు కాసులకు కక్కుర్తిపడి ఆక్రమణను ఆరు సెంట్లకు కుదించేశారన్న ఆరోపణలున్నాయి.
సర్వే నంబరు 113లోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఆక్రమణదారులు గతంలో వంద గజాల చొప్పున క్రమబద్ధీకరణ పట్టాలు పొందారు. ప్రభుత్వ ప్రజా ప్రయోజనాలకు మరికొంత భూమిని అధికారులు వినియోగించారు. వీటిని మినహాయిస్తే ప్రస్తుతం పది ఎకరాలకు పైగా ఉంది. అయితే ఇదంతా ఆక్రమణదారుల చెరలోనే ఉంది. చినముషిడివాడ బీఆర్టీఎస్ రహదారికి అత్యంత సమీపంలోని రూ.కోట్లు విలువ చేసే ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆక్రమణలపై చర్యలు చేపడతాం
- ఆనంద్కుమార్, తహసీల్దార్, పెందుర్తి
చినముషిడివాడలోని సర్వే నంబరు 113లో ఆక్రమణలపై చర్యలు చేపడతాం. 112లో వున్న కొంత జిరాయితీ భూమిని ఆసరాగా చేసుకుని, తప్పుడు సర్వే నంబర్లు వేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారనే ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సర్వే చేసి, ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షిస్తాం.
Updated Date - 2022-12-07T00:56:54+05:30 IST