సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఉచిత వైద్యం
ABN, First Publish Date - 2022-06-02T06:11:51+05:30
సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నుంచి ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తగరపువలస, జూన్ 1: సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నుంచి ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జి.వెంకటరత్నం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.కృష్ణమూర్తి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ రజిత రత్నకుమారిలు ఆవిష్కరించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో 22 ప్రత్యేక విభాగాలు, ఎనిమిది సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 920 పడకలు, 16 ఆపరేషన్ థియేటర్లు వున్నాయని డైరెక్టర్ డాక్టర్ వెంకటరత్నం తెలిపారు. అలాగే 250 మంది వెైద్యులు, 180 మంది పీజీ విద్యార్థులు, 150 మంది హౌస్ సర్జన్లు, 750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు వున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో నామమాత్రపు చార్జీలతో వైద్యం అందించామని, ఇకపై ఉచితంగా వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. స్పెషలిస్ట్ వైద్యుల నుంచి ఉచిత సలహాలను కూడా పొందవచ్చునన్నారు. అవుట్ పేషెంట్ విభాగాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Updated Date - 2022-06-02T06:11:51+05:30 IST