15 వేల ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ
ABN, First Publish Date - 2022-08-16T06:41:13+05:30
ఏజెన్సీలో ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు.
ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ
పాడేరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తెలిపారు. మండలంలోని వంతాడపల్లి గ్రామంలో కాఫీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాఫీ రైతులతో మాట్లాడుతూ ఈ ఏడాది లక్ష్యం మేరకు మన్యంలో 15 వేల ఎకరాల్లో కాఫీ మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజన రైతులకు మరింత ఉపయోగం కలిగేలా జి.మాడుగుల మండలంలో ఎకో పల్పింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎకో పల్పింగ్ యూనిట్కు కాఫీ పళ్లు సరఫరా చేసే రైతులకు కేజీకి రూ.40 చొప్పున చెల్లిస్తారన్నారు. కాఫీ రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాఫీ రైతులు నిచ్చెనలు, బేబీ పల్పర్లు పంపిణీ చేయాలని కోరగా ఐటీడీఏ పీవో సానుకూలంగా స్పందించారు. అలాగే వచ్చే ఏడాది 16 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, స్థానిక ఎంపీపీ ఎస్.రత్నకుమారి, కాఫీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-08-16T06:41:13+05:30 IST