కార్యకర్తలకు అందుబాటులో ఉండండి
ABN, First Publish Date - 2022-01-26T06:09:32+05:30
‘తమరేమో మాకు అందుబాటులో ఉండడం లేదు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో కనీస గుర్తింపు లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మీకు ఇబ్బందికర పరిస్థితి తప్పదు.’ ఇదీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎదుట వైసీపీ ముఖ్య కార్యకర్తలు మనోవేదన.
వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు
వైసీపీ మండల సమావేశంలో ఎమ్మెల్యే ఎదుట గోడు
చోడవరం, జనవరి 25: ‘తమరేమో మాకు అందుబాటులో ఉండడం లేదు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో కనీస గుర్తింపు లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మీకు ఇబ్బందికర పరిస్థితి తప్పదు.’ ఇదీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఎదుట వైసీపీ ముఖ్య కార్యకర్తలు మనోవేదన. తిమ్మనపాలెం సమీపంలోని తోటలో మంగళవారం జరిగిన పార్టీ సమారాధనలో పలువురు నాయకులు గ్రామాల్లో పరిస్థితులపై ఏకరువు పెట్టారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారినే ఎమ్మెల్యే పక్కన కూర్చోపెట్టుకుని ప్రాధాన్యం ఇస్తే, పార్టీకి కష్టపడి పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని, వారికి గుర్తింపు ఏం ఉంటుందని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏ పనులూ జరగడం లేదని, ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పటికే అన్ని చోట్లా గ్రూపులు పెరిగిపోయి ఎవరికి వారు అన్నరీతిగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకులకు పక్కనపెట్టాలని ధర్మశ్రీకి హితవు పలికారు.
గ్రామాల్లో పర్యటిస్తా: ఎమ్మెల్యే
ఇకపై గ్రామాల్లో పర్యటిస్తానని, సచివాలయాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు నాయకులు కార్యకర్తల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని ప్రకటించారు. పార్టీలో కష్టపడిన వారందరికీ గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ గాడి కాసు, జడ్పీటీసీ సభ్యురాలు మారిశెట్టి విజయ, వైస్ ఎంపీపీలు బైన కుమారి, బొడ్డేడ గంగరాజు, పార్టీ మండల నాయకులు శ్రీకాంత్, ఏడువాక సత్యారావు, మూడెడ్ల శంకరరావు, పల్లా నరసింగరావు, వెంపలి ఆనంద్, బైన ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-26T06:09:32+05:30 IST