ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-06-28T06:30:41+05:30
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుచ్చిరాజుపాలెం గవరవీధిలో చోటుచేసుకుంది.
ఎన్ఏడీ జంక్షన్, జూన్ 27: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుచ్చిరాజుపాలెం గవరవీధిలో చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గవరవీధి రామాలయం సమీపంలో వుంటున్న బొట్టా సత్యనారాయణ(40) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నాళ్ల క్రితం భర్తతో గొడవ పడి భార్య పెందుర్తిలో వుంటున్న పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మృతుడు తమ ఇద్దరి పిల్లలతో కలిసి గవరవీధిలో ఉంటున్నాడు. ఈ నెల 23న పిల్లలిద్దరూ పెందుర్తిలోని అమ్మమ్మ వాళ్లింటి వద్దనుంటున్న తల్లి వద్దకు వెళ్లారు. శనివారం రాత్రి పిల్లలు తండ్రితో మాట్లాడారు. అయితే శనివారం రాత్రి 11.15 గంటల సమయంలో తమకు తండ్రి ఫోన్ చేస్తే నిద్రలో వున్నందున మాట్లాడలేదని కుమార్తె దుర్గా భవ్య తెలిపింది. ఆదివారం రాత్రి బంధువుల సమాచారంతో దుర్గాభవ్య సోదరుడు హర్షవర్ధన్తో వచ్చి తలుపులు బలవంతంగా తెరిచి చూడగా తమ తండ్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని వున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కుమార్తె దుర్గాభవ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-06-28T06:30:41+05:30 IST