కార్పొరేట్ కంపెనీల సేవలో మోదీ ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-10-03T09:41:46+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల సేవల్లో తరిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్ కౌర్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్ కౌర్
‘ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర’ నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
విశాఖపట్నం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల సేవల్లో తరిస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజిత్ కౌర్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో భాగంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 600 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖపట్నం బీచ్రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి కాళీమాత గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. నాడు మ హాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ‘ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర’ చేయడం అభినందనీయమని అన్నారు.
మోదీ ప్రభు త్వం దేశ సంపదను పెట్టుబడిదారీ శక్తులకు దోచిపెడుతోందని విమర్శించారు. నిక్షేపంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు ఎందుకు కట్టబెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం అని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల్లో నడుస్తోందన్న కేంద్ర పాలకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
Updated Date - 2022-10-03T09:41:46+05:30 IST